కర్నూల్లో కరోనా స్టేజ్ 4 ?- వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్- నలుగురు డాక్టర్లే..
ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా... తాజాగా ఏకంగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వీరిలో నలుగురు డాక్టర్లే కావడం విశేషం. దీంతో జిల్లాలో పరిస్ధితులు ఎంత విషమంగా ఉన్నాయో అర్ధమవుతోంది.
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో అంతా డాక్టర్లే. వీరంతా నెల రోజులుగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి కరోనా సోకింది. వీరి నుంచి కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి కూడా వైరస్ వ్యాప్తి చెందింది. వీరితో కలిపి మొత్తం ఆరుగురు ప్రస్తుతం కర్నూల్లో చికిత్స పొందుతున్నట్లు సంజీవ్ కుమార్ వెల్లడించారు. కర్నూలు నగరం ప్రస్తుతం స్టేజ్ 4లో ఉందని సంజీవ్ కుమార్ తాజాగా తెలిపారు.
కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిలో చాలా మందికి కరోనా వైరస్ సోకి ఉండొచ్చని సంజీవ్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వ్యాప్తి పరిస్దితులకు ఇవి అద్దం పట్టేలా ఉన్నాయని చెబుతున్నారు.