స్నేక్ గ్యాంగ్: దయానీ కోసం శ్రీశైలం అడవుల్లో చేజింగ్
హైదరాబాద్: పాముతో బెదిరించి, వివస్త్రను చేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు దయానీని పట్టుకోవడానికి పోలీసులు శ్రీశైలం అడవుల్లో చేజ్ చేసినట్లు సమాచారం. ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రధాన నిందితుడు దయానీని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత 18 రోజుల పాటు అతని కోసం ఎన్నో తిప్పలు పడ్డారు.
దయానీ శ్రీశైలం అడవుల్లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో అతన్ని పట్టుకునేందుకు బాధితురాలి బంధువును ఒకరిని తోడు తీసుకుని స్థానిక ఎస్సైతో కూడి పోలీసు బృందం వెళ్లింది. ఇదే సమయంలో దయానీని కలుసుకునేందుకు స్కార్పియోలో వెళ్తున్న హమ్దీ కనిపించాడు. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లి హమ్దీ ప్రయాణిస్తున్న స్కార్పియోను పోలీసులు అడ్డగించారు. ఈ మేరకు గురువారంనాడు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
హమ్దీ ఇచ్చిన సమాచారంతో ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్న దయానీని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. అయితే, అప్పటికే పోలీసుల రాకను పసిగట్టిన దయానీ అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాడు. అతని కోసం అడవిలో మూడు కిలోమీటర్ల మేర పోలీసులు గాలించారు. అయితే, అతని ఆచూకీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఆ తర్వాత మధ్యవర్తుల సహాయంతో దయానీ పోలీసులకు లొంగిపోయాడు.
నిందితులను అరెస్టు చేయడంలో హైదరాబాద్ పాతబస్తీ పహడీషరీఫ్ పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై వివాదం చెలరేగింది. బాధిత కుటుంబం గట్టినగా పట్టుట్టడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ను ఆశ్రయించింది. ఘటన తర్వాత దయానీ ఇంట్లోనే ఉన్నట్లు బాధిత కుటుంబ తొలుత సమాచారం అందించింది. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు సాహించలేదని అంటున్నారు. ఇద్దరు హోంగార్డులు ఇంటి బయట వేచి ఉండి వెనుదిరిగినట్లు చెబుతున్నారు.