మహాకుంభ మేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం స్థానిక భక్తులను భక్తి పారవశ్యానికి లోను చేసింది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మొదలైన పంచ సూక్తాలను అర్చకులు వల్లించారు.
అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదనంతరం శ్రీ చక్రతాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, సూపరింటెండెంట్ గురు రాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించాలి: టిటిడి ఈవో శ్యామలరావు
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో టిటిడి నిర్వహించనున్న శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ప్రయాగ్ రాజ్ సెక్టార్ - 6లో టిటిడి చేపడుతున్న రోజువారి కార్యక్రమాలపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్తరాది భక్తులు విరివిగా వచ్చే అవకాశం ఉంటుందని, భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జనవరి 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టిటిడి విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు.
శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు చేయాలని సూచించారు. శ్రీవారి భక్తులకు ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను సమకూర్చుకోవాలన్నారు. ప్రయాగ్ రాజ్లో టిటిడి చేపడుతున్న రోజువారి శ్రీవారి కైంకర్యాలు, సౌకర్యాలను వర్చువల్ ద్వారా టిటిడి ఈవోకు టిటిడి అధికారులు నివేదించారు. శ్రీవారికి రోజువారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరుగుతున్న సేవలను వివరించారు. శ్రీవారి నమూనా ఆలయానికి రోజువారి భక్తులు ఎంత మంది వస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు చేపడుతున్నారు, టిటిడి సిబ్బందికి ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను ఈవో అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications