ఆళ్లగడ్డ బరిలో శోభ కూతురు, ఏకగ్రీవానికి అవకాశం!
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిక్కెట్ను భూమా కుటుంబానికే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి.
అయితే, భూమా కుటుంబసభ్యులే బరిలోకి దిగే అవకాశాలున్నాయట. పార్టీ అధిష్టానం కూడా ఆ కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఖరారు చేయాలని యోచిస్తోందట.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో... ఆళ్లగడ్డ బరిలో దిగిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆమె మెృతి చెందినప్పటికీ ఈవీఎం బ్యాలెట్లో ఆమె పేరును కొనసాగించారు. ఆమెకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించినట్లు ఈసీ ధృవీకరించింది.

ఆమె మృతి చెందినందున ఉప ఎన్నిక జరగనుంది. ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి కూతురును బరిలోకి దించవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డికి శాసన సభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి ఇచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యోచిస్తోంది.
మరోవైపు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఆయన కుమార్తెను పోటీలో నిలిపే అవకాశముంది. మృతి చెందిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఇతర పార్టీలో బరిలో దిగకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది.












Click it and Unblock the Notifications