కారు ప్రమాదం: శోభా నాగిరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. శోభా మృతి చెందినట్లు హైదరాబాదు బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రి వైద్యులు గురువారం ధ్రువీకరించారు. ఆమె ఉదయం 11.05 నిమిషాలకు మృతి చెందినట్లు చెప్పారు. శోభా నాగిరెడ్డి ఈ ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. బుధవారం రాత్రి ఆమె ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే.
బుధవారం రాత్రి కర్నూలు జిల్లాలో పార్టీ నేత షర్మిల సభకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఆళ్లగడ్డలోని దూబగుంట ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పైన ఉన్న ధాన్యం కుప్పలను డ్రైవర్ గుర్తించలేకపోయారు. ధాన్యం కుప్పలు దగ్గరకు వచ్చాక అతను సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు నాలుగు పల్టీలు కొట్టింది.
ఆమెకు నంద్యాల, కర్నూలులో వైద్యం అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. కేర్ ఆసుపత్రిలో వైద్యుల చికిత్సకు ఆమె స్పందించలేదు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందించారు. ఆమెను బతికించాలన్న వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు గురువారం తెలిపారు.
శోభా నాగి రెడ్డి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విషాదచాయలు అలుముకున్నాయి. శోభా నాగిరెడ్డి ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమె పక్కటెముకలు విరిగాయి. తలకు కూడా గాయాలయ్యాయి. శోభా నాగిరెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.