తెలంగాణ వద్దు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు..ఊహించని కొత్త డిమాండ్!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉన్న సొంత రాష్ట్రంలో ఆయన పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రతీ రోజు విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో మాత్రం ఏపీ సీఎం జగన్ కు క్రేజ్ పెరుగుతోంది. అందునా ప్రధానంగా విద్యార్ధుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఒక విద్యార్ది సంఘం తన నిరసనలో భాగంగా ఏకంగా ఒక కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. అదే..ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ విద్యార్ధి సంఘ నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు..జగన్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ వద్దు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు అంటూ వారి కొత్త డిమాండ్ పైనే ఇప్పడు అసలు చర్చ.
సీఎం జగన్ కు రాజధాని రైతుల అల్టిమేటం .. ప్రకటనపై డెడ్ లైన్
తెలంగాణలో జగన్ కు మద్దతుగా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు దక్కాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కావస్తోంది. అయితే, ఈ సమయంలోనే సీఎం తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అటు కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖల మంత్రుల మొదలు..ఏపీలోని ప్రతిపక్షాలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఆయన ఏపీలో వాలంటీర్లు.. సచివాలయ ఉద్యోగాల పేరుతో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, సొంత పార్టీ వారికే ఈ ఉద్యోగాలు దక్కాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారంలో తెలంగాణలో కొత్త డిమాండ్ కు కారణమైంది.
మొన్న ఆర్టీసీ కార్మికులు..నేడు విద్యార్ధులు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు..అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఏపీయస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసారు. దీనిని ప్రస్తావిస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు..కొన్ని పార్టీల నేతలు పలు మార్లు ఏపీ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఇదే విషయంలో జగన్ నిర్ణయం తో తెలంగాణ సీఎం విభేదించారు. ఇక, ఇప్పుడు తెలంగాణలోని విద్యార్ధులు ఏపీలో ఉద్యోగాల భర్తీ చేస్తున్న విధానం పైన ఫోకస్ పెట్టారు. ప్రతీ జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన వారిని ఆకర్షించింది. అదే సమయంలో తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ పైన నిర్ణయం తీసుకోకపోవటం పైన వారు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే టీయస్అర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీల్లోనూ జగన్ కు అనునూల నినాదాలు వినిపించాయి.
కొత్త డిమాండ్ తో విద్యార్ధుల నిరసన..
తాజాగా పశు వైద్య విద్యార్ధుల సంఘం ఒక బ్యానర్ తో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రదర్శించిన బ్యానర్ లో తెలంగాణ వద్దు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు అనే నినాదం ఉంది. దీని ద్వారా కేవలం ఏపీలో ఇస్తున్న ఉద్యోగాల కారణంగానే వారు ఈ డిమాండ్ తెర పైకి తెచ్చినట్లుగా కనిపిస్తోంది. వారు ఏపీ ముఖ్యమంత్రి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే..తమకు మాత్రం ఉద్యోగాల కల్పన ఊపే లేదంటూ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇలా ..సొంత రాష్ట్రంలో జగన్ పాలన పైన ఎటువంటి స్పందన ఉన్నా..తెలంగాణలో మాత్రం అక్కడక్కడా జగన్ కు క్రేజ్ కనిపిస్తోంది. దీంతో..గతంలో రాష్ట్ర విభజన కోసం తీవ్రంగా ఉద్యమం చేసిన వారిలోని కొందరు విద్యార్ధులు ఇప్పుడు ఈ తరహా డిమాండ్లు తెర పైకి తేవటం హాట్ టాపిక్ గా మారింది.