అక్కడే మకాం!: ఏజెంట్లకు టీడీపీ డైరెక్షన్స్.. ఈసీ ఆంక్షలు లెక్క చేయకుండా..
బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డిలు బస చేస్తున్నట్లు సమాచారం.
కర్నూల్: నంద్యాలలో ప్రచారం పర్వం ముగిసిన వెంటనే.. అంతర్గతంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓటు మేనేజ్మెంట్ కీలకం కావడంతో.. నంద్యాల చుట్టు పక్కల నుంచే ఈ ఏర్పాట్లను ఆయా నేతలు పర్యవేక్షిస్తున్నారు.
ప్రచారం తర్వాత ఇతర నేతలెవరూ నంద్యాలలో ఉండకూడదన్న నిబంధనలు ఉండటంతో.. టీడీపీ నేతలు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో మకాం వేశారు. బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో నుంచే ఓటు మేనేజ్మెంట్ కు సంబంధించిన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డిలు బస చేస్తున్నట్లు సమాచారం. అక్కడ నుంచే వీరంతా ఎన్నికల సరళిని గమనించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నిక సమయంలో ఏజెంట్లు ఎలా వ్యవహరించాలి?, పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లతో ఎలా మెదలాలి? వంటి విషయాలను వీరు ఏజెంట్లతో ఫోన్ల ద్వారా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, కర్నూలు జిల్లాకు చెందనివారంతా జిల్లాను విడిచి వెళ్లాలని ఈసీ ప్రకటించినప్పటికీ.. నేతలు మాత్రం అదేమి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.