నాయినివి తాటాకు చప్పుళ్లు, దమ్ముందా: సోమిరెడ్డి, మాకూ ఏసీబీ ఉంది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తి లేదని, దమ్ముంటే తెరాస ఎమ్మెల్యేలతో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వీడియో సంభాషణలను విడుదల చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం సవాల్ చేశారు.
కేసీఆర్ ఏడాది పాలనలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ అయ్యేవా చెప్పాలన్నారు.
మా దగ్గరా ఏసీబీ ఉందని, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీ రామారావులు టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడారన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాదుపై తమకూ హక్కులున్నాయన్నారు. తమ ప్రభుత్వం చేతుల్లోనూ ఏసీబీ ఉందన్నారు.
కేసీఆర్ది రైటైతే, రేవంత్దీ రైటే: తెలంగాణ టీడీపీ

ఎమ్మెల్యేల కొనుగోలు వల్లే అసెంబ్లీలో 63 సీట్లున్న తెరాసకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85 ఓట్లు వచ్చాయని తెలంగాణ టీడీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌజ్ కేంద్రంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలుకు వందలాది కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని ఆరోపించింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు బుధవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు కేసీఆర్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తన ఫాంహౌజ్కు పిలిపించుకొని తెరాస కండువా కప్పారని, తమ కొనుగోళ్ల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే తెరాస నేతలు రేవంత్ రెడ్డిపై యాగీ చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ చేసింది రైటైతే రేవంత్దీ రైటే, రేవంత్ది తప్పయితే సీఎందీ తప్పేనని దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. చిన్న రాష్ట్రాల్లో కక్షపూరిత రాజకీయాలు ఉంటాయని అందరూ వ్యక్తం చేసిన ఆందోళనను కేసీఆర్ నిజం చేసి చూపిస్తున్నారన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపి.. తెలంగాణ ఆవిర్భావాన్ని వ్యతిరేకించిన జగన్తో ఎలా మిలాఖత్ అవుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు.
అధికారమే పరమావధిగా కలిసిన కేసీఆర్, జగన్లు చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తన అక్రమాలపై నిలదీస్తున్నందుకే కేసీఆర్ రేవంత్ని లక్ష్యంగా ఎంచుకున్నారని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ రేవంత్ని ఇరికించేందుకే వాడారని విమర్శించారు.
రాష్ట్రానికే మోసగాడు విడుదల చేసిన జగన్
మంగళగిరిలో సమర దీక్ష చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రానికే మోసగాడు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో చంద్రబాబు పాలనలో మోసం జరిగిందని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ విమర్శించారు. బాబు హయాంలో రైతులకు ఎప్పుడు అన్యాయమే జరుగుతోందన్నారు. రైతులు, మహిళల ఇంటికి బంగారం తెచ్చిస్తానని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడేమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications