వైయస్ జగన్ సోనియా కాళ్లు పట్టుకున్నాడు: సోమిరెడ్డి
ఇప్పటికీ లక్ష్మినారాయణకు కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదని ఆరోపించారు. సిబిఐని కాంగ్రెస్ తనకు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటోందని ఆరోపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై జగన్కు అవగాహనే లేదని, పోలవరం, కృష్ణా ట్రిబ్యునల్ గురించి అసలే తెలియదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చరిత్ర హీనుడం, కాలర్ పట్టుకోమనడం దారుణమని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర విభజన విషయంలో ఎప్పుడైనా సోనియా గాంధీని ప్రశ్నించావా అని జగన్మోహన్ రెడ్డిని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం ఏమి చేయని నీకు చంద్రబాబును విమర్శించే హక్కు లేదని జగన్పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తన క్రిమినల్ భాషను మార్చుకోవాలని అన్నారు. 2001లో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని విభజన చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని జగన్ కోరాడని అన్నారు. అవినీతి చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుపై మాట్లాడే అర్హత లేదని అన్నారు.
ఏపి ఎన్జివోలు, సీమాంధ్ర ప్రజలు 66 రోజులపాటు శాంతియుత ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు ఎక్కడున్నావని జగన్ను ప్రశ్నించారు. శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎందుకు జగన్ పార్టీ హాజరుకాలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీని విమర్శించే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డికి విభజనపై మాట్లాడే అర్హత లేదని అన్నారు.
విభజనతో రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని టిడిపి కోరుకుంటోందని సోమిరెడ్డి అన్నారు. అలా జరగని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత విభజన బిల్లుతో విభజన జరిగితే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని పార్టీలు విభజన వద్దని చెబుతున్నా.. కేంద్రం విభజనపై మూర్ఖంగా ముందుకు వెళుతోందని ఆరోపించారు.
సమైక్యం కోసం పోరాడుతున్న ఏపిఎన్జివోల కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని ఆ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. జనవరి 10 వరకు ఏపిఎన్జివోలు నిర్వహించే కార్యక్రమాలలో సీమాంధ్ర టిడిపి నేతలు పాల్గొంటారని తెలిపారు. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు అఫిడవిట్లు ఇస్తామని స్పష్టం చేశారు.