జగన్! ఒక్క మాట మాట్లాడావా?, కాళ్లు మొక్కేందుకు తప్ప..: ఏకిపారేసిన సోమిరెడ్డి, గంటా
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంకెంత కాలం రాజీనామాల పేరుతో ప్రజలను మభ్యపెడతావంటూ వారు ధ్వజమెత్తారు.
బుధవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో కేంద్రంతో రాజీ లేకుండా పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీ మిత్రపక్షమైనా 29 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిశారని, అన్ని ప్రయత్నాలు చేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు.
ఒక్క మాట మాట్లాడని జగన్
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు పోరాడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూశారని సోమిరెడ్డి అన్నారు. ప్రతిపక్షమైన వైసీపీ కేంద్రంతో లాలూచిపడి కేవలం టీడీపీని టార్గెట్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు రాజీనామాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
అప్పుడు సోనియా కాళ్లపై.. ఢిల్లీకి వెళ్లారా?
ఇంకా ఎంతకాలం జగన్ ప్రజలను మభ్యపెడతారని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. మడమతిప్పని వంశమని చెప్పి, ఆనాడు బెయిల్ కోసం జగన్.. ఢిల్లీలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందేనని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఏనాడైనా ఢిల్లీ వెళ్లారా? అని మంత్రి నిలదీశారు.
రాజకీయాలు ముఖ్యం కాదు
కేంద్రంలో మంత్రిగా ఉండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం సుజనా చౌదరి పోరాటం చేశారని సోమిరెడ్డి కొనియాడారు. పార్లమెంటులో పోరాడిన మంత్రులు, ఎంపీలపై జగన్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు రాజకీయాలు ముఖ్యం కాదని అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
ఆ దమ్ము జగన్కు లేదు.. రోడ్లపైనే..
రాజీనామాలు చేయడం పెద్ద విషయమేమీ కాదని, పెద్ద పెద్ద పదవులను చూశామని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదని సోమిరెడ్డి అన్నారు. శాసనసభలో ఏరోజు ప్రజా సమస్యలు మాట్లాడని జగన్.. ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు.
కేసుల నుంచి తప్పించుకోవడానికి..
మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాజీనామా నాటకాలు జగన్మోహన్ రెడ్డికి కొత్తేం కాదని అన్నారు. జగన్ ఏం చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని గంటా ఆరోపించారు. కాగా, బీజేపీ మిత్ర ధర్మాన్ని పాటించడం లేదని టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు ఆరోపించారు.