వెనక్కి తగ్గేదే లేదు.. సోమిరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: కాకాని
తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను ఆ శాఖలకు పంపించానని సోమిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్: నిరాధారంగా తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. తనపై అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన తాను భయపడేది లేదని, దేనికైనా సిద్దమేనని స్పష్టం చేశారు.
సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపిస్తున్న కాకాని.. ఆయన విదేశీ లావాదేవీలపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను ఆ శాఖలకు పంపించానని సోమిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సోమిరెడ్డి ఇకనైనా నీచ రాజకీయాలను మానుకుని, తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
సోమిరెడ్డికి నిజంగా ధైర్యంగా ఉంటే.. విచారణకు ఎందుకు సిద్దపడటం లేదని ఈ సందర్బంగా కాకాని ప్రశ్నించారు. జైలుకు, కేసులకు తాను భయపడే రకం కాదన్నారు. క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తే సోమిరెడ్డిపై రెండు మూడొందల కేసులు పెట్టాల్సి వస్తుందని కాకాని మండిపడ్డారు.
ప్రభుత్వం చేపడుతున్న చెట్టు-నీరు కార్యక్రమంలో కమిషన్లు తీసుకున్న చరిత్ర సోమిరెడ్డిది అని, ఆఖరికి క్రికెట్ కిట్లు అమ్ముకున్న దిగజారుడు చరిత్ర సోమిరెడ్డిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నది టీడీపీ అయినంత మాత్రాన భయపడేది లేదని అన్నారు. జగన్ పై ఆరోపణలు చేస్తే మంత్రి పదవి వస్తుందన్న భ్రమల్లో సోమిరెడ్డి ఉన్నారని కాకాని విమర్శించారు.
శనివారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీకి ఆయన రాసిన లేఖను మీడియాకు అందజేశారు.