టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ అమరావతే : సోమిరెడ్డి సంచలనం: ఇరకాటంలో నెట్టేందుకేనా..!
టీడీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. అదే సమయంలో ఒక వేళ రాజధాని అమరావతి నుండి మార్చినా..తాము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాలా అంటూనే సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తిరిగి రాజధాని మారుస్తామంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో తాము తమ ప్రాంతంలో ఇబ్బంది పడతామంటూ ఉత్తరాంధ్ర నేతలు వాపోతున్నారు. అయితే, రాజధాని మార్పుకు వ్యతిరేకంగా టీడీపీ స్టాండ్ తీసుకన్నట్లుగా కనిపిస్తున్న సమయంలో..సోమిరెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకమా ... లేక సొంత పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నాయా అనే చర్చ టీడీపీలోనే సాగుతోంది.
సోమిరెడ్డి వ్యాఖ్యలతో కలకలం..
మూడు రాజధానుల ప్రతిపాదన పైన మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన రాజధాని తరలింపు సాధ్యం కాదని..అది ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతమని చెప్పుకొచ్చారు. శాసనసభలో ప్రతి పక్షనేతగా అమరావతిని స్వాగతించి..ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన చేయటం సరి కాదన్నారు. రాజధాని తరలించాలంటే తాతలు దిగిరావాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం..న్యాయ వ్యవస్థ ఉంద ని..మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డుకుంటామని స్పష్టం చేసారు.
సీఎం మారితే రాజధాని మారాలా అంటూ
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాలా అంటూనే..సోమిరెడ్డి తాము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని కొనసాగిస్తామంటూ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలంతా అమరావతి నుండి రాజధాని తరలింపు వద్దని డిమాండ్ చేస్తున్న సమయంలో..తాము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని కొనసాగిస్తామంటూ సీనియర్ నేతగా ఉన్న సోమిరెడ్డి వ్యాఖ్యానించటం పైన పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సోమిరెడ్డి వ్యాఖ్యలు తమకు ఇబ్బంది కలిగిస్తాయని ఉత్తరాంధ్ర నేతలు వాపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది అమరావతి ప్రజలకు మద్దతుగా చేసినట్లు కనిపిస్తున్నా.. ఇతర ప్రాంత ప్రజలను మరింత గందగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వైసీపీకి అస్త్రమా..ఇరకాటమా..
తాము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ ఇంకా రియాక్ట్ కాలేదు. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఉత్తరాంధ్రలో తమకు అనుకూలంగా మలచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న ప్రాంతాల్లో మాత్రం వైసీపీ ఇరకాటంలో పడే ఛాన్స్ లేకపోలేదు. దీంతో..సోమిరెడ్డి వ్యాఖ్యలు అటు వైసీపీలోనూ..ఇటు టీడీపీలోనూ కొత్త చర్చకు కారణమయ్యాయి. అసలు..ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్పు ఏంటని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలే..ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే మరోసారి రాజధాని అమరావతి లోనే కొనసాగిస్తామని చెప్పటం సైతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.