కేసీఆర్ ముక్కు పెద్దది, ఈజీ: సోమిరెడ్డి, వదిలేశామని..
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనడాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పు పట్టారు. ఆయన హైదరాబాదులో మాట్లాడారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, మూడెకరాల పొలం ఇస్తానని కేసీఆర్ ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపాడన్నారు.
ఇళ్లకు 24 గంటలు కరెంటు ఇస్తానని, రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తానని ప్రకటించాడని, ప్రస్తుతం రైతులకు మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్నారు. వీటన్నింటికి చంద్రబాబే కారణమని, చంద్రబాబు ముక్కుపిండి కరెంటు వాటాను తీసుకుంటామని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

పిండితే విద్యుత్ వచ్చేందుకు చంద్రబాబు ముక్కేమన్నా పవర్ ప్లాంటా అన్నారు. కేసీఆర్ ప్రతి దానికి ముక్కు నేలకేసి రాయాలని అంటారని, ఆయన ముక్కు పొడవుగా ఉంది కాబట్టి నేలకేసి రాయడం ఈజీ అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది మీడియాపై ప్రతాపం చూపడానికి కాదన్నారు.
రెండు చానళ్లను అడ్డుకోవడం కాదని, పరిపాలన విషయంలో ప్రతాపం చూపాలన్నారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రిని అనే సంగతి మర్చిపోతున్నారన్నారు. ఆంధ్రావాళ్లను తిడితే సమస్యలు పరిష్కారం కావన్నారు. అన్నీ వదులుకుని తాము వెళ్లిపోయామన్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్నారు.
అంతకుముందు మరో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. మచిలీపట్నంలో రూ.20 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటామన్నారు. రాయలసీమ ప్రజల కష్టాలు తీర్చేందుకు కొన్ని టీఎంసీల నీరు కేటాయిస్తామన్నారు. ఈ వేసవిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే నెల నుండి జన్మభూమిలో వచ్చే వినతుల పనులు జరుగుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications