రూ.500, రూ.1000 నోట్ల రద్దు: 'దటీజ్ బాబు, నేను, వైయస్ జగన్ షాకయ్యాం'
నెల్లూరు: రూ.500, రూ.1000 నోట్లు రద్దు నిర్ణయం చూడగానే తాను షాకయ్యాని, వెంటనే నా బీరువా తీసి చూసుకున్నానని, 26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని ఎలా మార్చాలా అని ఆందోళన చెందానని టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
తానే ఈ రకంగా ఆందోళన చెందితే సోదరుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంకెంత ఆందోళన చెంది ఉంటాడోనని ఆయన ఎద్దేవా చేశారు.
బెంగళూరు వైట్ హౌస్లో భూగర్భంలో ఉన్న డబ్బును ఏం చాయాలో తెలియక షాకై ఉంటారని, ఎప్పటి నుంచో రూ.వెయ్యి, రూ.500 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు చెబుతున్నారన్నారు. ఇంతటి కీలక నిర్ణయంలో చంద్రబాబు ప్రభావం ఉందని, దటీజ్ చంద్రబాబు అన్నారు.
కాగా, రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సంచలనం అయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి వచ్చింది. నేడు బ్యాంకులు, ఏటీఎంలను మూసివేశారు. రేపు మరికొన్ని ఏటీఎంలు కూడా పని చేయవు.
రద్దయిన నోట్లను మార్చుకునేందుకు గడువు డిసెంబర్ 30వ తేదీ వరకు ఇచ్చారు. త్వరలో సరికొత్త రూ.500, రూ.2000 నోట్లు రానున్నాయి. కాగా, ఈ మహాయజ్ఞంలో అందరు భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.