మత్స్యకారులను పాలెగాళ్ళుగా మార్చే పథకం: ఏపీ సర్కారుకు సోము వీర్రాజు హెచ్చరిక
అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మొబైల్ మటన్, చేపల మార్టులపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలతోపాటు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే జీఓ నెం. 217ను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
జీవోతో లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాలను గందరగోళంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి 9 ప్రశ్నలతో కూడిన ఒక బహిరంగ లేఖ రాశారు. అంతరంగీకులకు, అనుచరులకు కడుపు నింపేందుకే, జీవో తెచ్చారని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ ప్రభుత్వం మత్స్యకారులను పాలెగాళ్ళుగా మార్చే కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల, వేల కోట్ల రూపాయలు, ఏ పథకం ద్వారా, ఏ విధంగా.. ఎన్ని వచ్చాయి ఎలా ఖర్చు చేశారో "ఒక శ్వేతపత్రం" రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేఖలో సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాలుగా ప్రచారాలకు, పత్రికా ప్రకటనలకు పరిమితమైన పోర్టులు, చేపల వేటకు ఉపయోగించే జట్టీల నిర్మాణాలు ఎన్ని మొదలెట్టారు ? ఎన్ని ప్రారంభించారు ? ఎప్పటికి పూర్తి చేస్తారు ? కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక మత్స్య మంత్రిత్వ శాఖను, ఏర్పాటు చేసి, తొలి బడ్జెట్లో 21 రాష్ట్రాలకు గాను.. రూ. 20 వేల కోట్లు కేటాయించిన సంగతి మరిచారని సోము వీర్రాజు ఏపీ సర్కారు విమర్శలు గుప్పించారు. తాజా జీఓ రద్దు కోరుతూ మత్స్యకారులను కలుపుకుని, రాష్ట్ర వ్యాప్తంగా మత్సకారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పోరాటం చేస్తామని సీఎం జగన్కు రాసిన లేఖలో సోము వీర్రాజు హెచ్చరించారు.
.@ysjagan గారి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన G.O. నెంబర్ 217 మత్స్యకారుల భవిష్యత్తును అంధకారం చేసేలా ఉంది. కాబట్టి, మేము అడుగుతున్న క్రింది 9 ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పి,G.O. రద్దు చేయాలని,లేందంటే మత్స్యకారులతో కలిసి ప్రజాపోరాటం తప్పదని AP Govt.ను @BJP4Andhra హెచ్చరిస్తున్నది. pic.twitter.com/OHW0EgaSEx
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 12, 2021
ఇది ఇలావుండగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు బలహీన వర్గాల పొట్ట కొట్టేందుకే మటన్ మార్టుల పేరిట సీఎం జగన్ కొత్త పథకానికి శ్రీకారం చూడుతున్నారని ఆరోపించారు. ఉన్నత చదువులు చదవిని విద్యార్థులకు తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. ఇప్పుడు మాంసం దుకాణాల్లో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. కొత్త సంస్థలను తీసుకొచ్చే సత్తా వైసీపీ సర్కారుకు లేదని, అందుకే మొబైల్ మార్టుల ద్వారా మాంసం విక్రయించేందుకు సిద్ధమవుతోందని ఎద్దేవా చేశారు.
Recommended Video
ఇప్పటికే ప్రభుత్వం మద్యం దుకాణాల్లోని కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కల్తీ మాంసం, చేపలు విక్రయించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సలహాతోనే సీఎం జగన్ మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందన్నారు. జగన్, విజయసాయి ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండేందుకే పనికొస్తాయని తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మార్టుల ద్వారా మాంసం విక్రయించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించాలని లేదంటే.. బడుగుబలహీన వర్గాలతో కలిసి భారీ ఎత్తు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.