'కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుకు సోనియాతో బాబు రహస్య చర్చ': మోడీ అసెంబ్లీ వీడియోపై...
Recommended Video
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు.
ఆయన కర్నూలులో పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వచ్చే 2019 ఎన్నికల్లో తాము (బీజేపీ) ఎక్కువ అసెంబ్లీ, లోకసభ స్థానాలు అడుగుతామని భావించి చంద్రబాబు ఎన్డీయే నుంచి తప్పుకున్నారని చెప్పారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు.
పవన్ దెబ్బ, బీజేపీ ఎఫెక్ట్: ఆ లోటును బాబు భర్తీ చేస్తారా? 'జగన్' బలమూ దెబ్బేనా?
కర్నాటకలో కాంగ్రెస్ను గెలిపించేందుకు బాబు ప్రయత్నం
కర్నాటకలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సోనియాతో రహస్య మంతనాలు జరిపారన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తిడుతున్నారన్నారు.
అభివృద్ధి అమరావతికే పరిమితం
ఏపీలో అవినీతిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు రావడం లేదని సోము వీర్రాజు అన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అమరావతికే పరిమితం చేశారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప డమ్మీగా మారారని, రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యే అనధికారికంగా హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
టీడీపీ తప్పుడు ప్రచారం
హోదా అంటూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. నిత్యం కేంద్రంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, రాజకీయ స్వార్థం కోసం టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అభివృద్ధిని రాజధాని అమరావతికే పరిమితం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
నిధులు ఇస్తున్నాం... ఇస్తాం
వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేయలేదని, కర్నూలు జిల్లాలో వ్యాగన్ వర్క్ షాపునకు అధిక నిధులు కేటాయించిందని వీర్రాజు తెలిపారు. కర్నూలు ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధికి ప్రణాళికలు పంపితే నిధులు ఇప్పిస్తామన్నారు. రాయలసీమకు వచ్చిన పరిశ్రమలు, అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
బాబు అసెంబ్లీ వీడియోకు సోము వీర్రాజు కౌంటర్
రాష్ట్రంలో అవినీతిని చూసి విదేశీ సంస్థలు ఇక్కడికి రావడం లేదని వీర్రాజు విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులపై గతంలో అసెంబ్లీలో చంద్రబాబు ప్రధాని మోడీని అభిమానించారని చెప్పారు. ఇందుకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించారు. ఇటీవల అసెంబ్లీలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రదర్శించారు. దానికి కౌంటర్గా నిధులు ఇస్తున్నందుకు మోడీని అసెంబ్లీలో పొగిడిన వీడియోను సోము వీర్రాజు ప్రదర్శించారు.