జల్సాలు, కోటి అప్పు: తల్లిని భార్యతో కలిసి కొడుకే చంపేశాడు
గుంటూరు: జల్సాలకు అలవాటు పడి, కోటి రూపాయలు అప్పు చేశాడు. సంపాదన లేదు. అతన్నీ, ఆతని భార్యను తల్లియే పోషిస్తోంది. మరో రెండు రోజుల్లో ఆ తల్లి అమెరికాలోని తన కూతురు వద్దకు వెళ్లిపోబోతోంది. ఈ సమయంలో కుమారుడు, కోడలు కలిసి ఆ మహిళను చంపేశారు. గొంతు నులిమారు. ప్రతిఘటిస్తే కొరికారు. దీంతో ఆమె మరణించింది.
ఈ నెల 23న గుంటూరు జిల్లా వినుకొండలోని కారంపూడి రోడ్డులో హత్యకు గురైన మాకినేని సత్యశ్రీ(56) కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ జి.శ్రీనివాసరావు గురువారం మీడియా సమావేశంలో వివరించారు. సీతారామ టవర్స్లో మాకినేని శివసుబ్బారావు, భార్య సత్యశ్రీ, కుమారుడు సందీప్, కోడలు శ్రావణ్య అద్దెకు నివాసముంటున్నారు. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో సందీప్ బకాయి చెల్లించేందుకు సొంతింటిని కూడా అమ్ముకుని అద్దె అపార్ట్మెంట్లోకి మారారు.
సందీప్ సంపాదన లేకుండా ఉంటుండటంతో ఇద్దరు మనవళ్ల(కవలలు) భవిష్యత్ కోసం కోడలు శ్రావణ్యను బీఈడీ చదివించింది. ఉద్యోగం చేసుకొని స్థిరపడాలంటూ కొడుకు, కోడలుకు చెబుతూ వచ్చింది. మందలింపులను అపార్థం చేసుకున్న సందీప్, శ్రావణ్య ఈ నెల 23 ఉదయం సుబ్బారావు వాకింగ్కు వెళ్లిన సమయంలో నిద్రపోతున్న సత్యశ్రీని 20 లీటర్ల వాటర్ క్యాన్తో తలపై బలంగా కొట్టి మెడకు షూలేస్ బిగించి ఊపిరాడకుండా చేశారు. ప్రతిఘటించిన సత్యశ్రీని విచక్షణారహితంగా కొరికి హతమార్చారు.

సుబ్బారావు ఇంటికి తిరిగి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్లేసరికి భార్య శవంగా కనిపించింది. కొడుకు, కోడలును అడగగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమను అడ్డగించి చంపి వెళ్లారని చెప్పార. అయితే అనుమానం కలిగి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పరారీలో ఉన్న సందీప్, శ్రావణ్యలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే చంపామని అంగీకరించారు. ఈ మేరకు ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారిని వినుకొండ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు.












Click it and Unblock the Notifications