కింకర్తవ్యం: కిరణ్ రెడ్డి లేఖలపై సోనియా సీరియస్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ లేఖ నేపథ్యంలో ఏం చేద్దామనే విషయంపై ఆమె గవర్నర్ నరసింహన్తో మాట్లాడినట్లు సమాచారం. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వేగంగా అడుగులు వేస్తూనే మరోవైపు రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
మూడు రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సహా ఇతర ఢిల్లీ పెద్దలందరినీ కలిసిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వారికి పరిస్థితులను వివరించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీ భేటీలో గవర్నర్ సమర్పించిన నివేదికపైనే వివరంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపకముందే రాష్ట్రానికి సంబంధించి పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునే అవకాశాలపై చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర విభజనపై జీవోఎం సాగిస్తున్న కసరత్తు రాజ్యాంగ విరుద్ధమని ముఖ్యమంత్రి రాసిన లేఖను కూడా కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్రానికి నివేదికలు పంపవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి చెప్పారని, రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతిష్ఠంభన రోజురోజుకూ తీవ్రమవుతోందని కేంద్రానికి గవర్నర్ తెలిపినట్లు సమాచారం.దీంతో ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైనే గవర్నర్ నివేదిక కేంద్రీకృతమైనట్లు సమాచారం.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని పట్టించుకోకుండా విభజన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధిష్ఠానం భావించిందని, దానివల్ల సీమాంధ్రకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు సంకేతాలు వెళతాయని ఊరుకున్నదని, అయితే గవర్నర్ నివేదిక తర్వాత కేంద్రం ఇక ఏ చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. నవంబర్ నుంచి మూడు నెలల పాటు కేంద్ర బడ్డెట్పై కసరత్తు జరపాల్సి ఉన్నందువల్ల తెలంగాణపై అక్టోబర్లోనే మంత్రిత్వ శాఖల పని పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నవంబర్ 7న జీవోఎం భేటీ నాటికి మొత్తం కసరత్తు పూర్తి చేసి బిల్లు రూపకల్పన మొదలుపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
నవంబర్ 25లోగా రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును పంపాలని ముందుగా భావించినప్పటికీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే నెల 15లోపే బిల్లు అసెంబ్లీ అభిప్రాయానికి వెళుతుందని, రెండువారాల గడువు విధిస్తారని ఆయన చెప్పారు. ఈ రెండు వారాల్లో అసెంబ్లీ సమావేశమై అభిప్రాయం చెప్పినా, చెప్పకపోయినా కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.
కాగా, తెలంగాణ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకుంటున్నట్లు కొందరు సీమాంధ్ర నేతలు చెప్పడంతో ప్రణబ్ ముఖర్జీ వైఖరిలోనూ మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం తనను సీమాంధ్ర నేతలు కలిసినప్పుడు ఆయన సీరియస్గా ముఖం పెట్టి తల పంకించడం తప్ప ఏమీ మాట్లాడలేదని, అంతా మాట్లాడిన తర్వాత నమస్కారం పెట్టి పంపించారని తెలిసింది. కాగా, ఈ భేటీకి ముందే రాష్ట్రపతిని సోనియా కలుసుకున్నారని, తెలంగాణపైనే చర్చించినట్లు సమాచారం. దాంతో సీమాంధ్ర నాయకుల తీరుపై సోనియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.