పొన్నాల లిస్ట్పై సోనియా అసంతృప్తి, కెసిఆర్పై నేతలు
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య లిస్టు పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆశావహుల లిస్టును పొన్నాల ఢిల్లీలో అధిష్టానం ముందు ఉంచారు. ఈ లిస్టు పైన సోనియా అసహనం వ్యక్తం చేశారు. మార్పులు చేర్పులు చేసి మరో లిస్టుతో రావాలని సూచించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి దిలీప్ కుమార్, సిరిసిల్ల నియోజకవర్గానికి విమలక్కను సోనియా సూచించినట్లుగా తెలుస్తోంది. అలాగే లెఫ్ట్ పార్టీతో పొత్తు అంశాన్ని పరిగణలోకి తీసుకొని తయారు చేయాలని సూచించారు. దీంతో పొన్నాల తిరిగి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు. ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో భేటీ అయి సీట్లపై చర్చించి, శుక్రవారం మళ్లీ అధిష్టానాన్ని కలుస్తారు.

డిగ్గీని కలిసిన కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని తాను డిగ్గీని కోరానన్నారు. పైరవీకారులకు టిక్కెట్లు ఇవ్వవద్దని చెప్పానన్నారు.
తెరాసపై పొన్నం
తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలను కోరారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికీ తెలంగాణలో తమ పెత్తనం కొనసాగించాలనుకుంటున్నారన్నారు. దీన్ని అరికట్టాలంటే సీమాంధ్రుల సభలను బహిష్కరించడం ఒక్కటే మార్గమన్నారు. మొన్న మహబూబ్నగర్లో చంద్రబాబు నిర్వహించిన టిడిపి సభను ఎందుకు అడ్డుకోలేకపోయారని తెరాస, ఐకాసలను ప్రశ్నించారు.
ఇద్దరు ఎంపీల తెరాస ఎలా తెచ్చింది: శ్రీధర్ బాబు
ఇద్దరు ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణను ఎలా తెచ్చిందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. తెరాసతో పొత్తు ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ వస్తే చాలన్న వారు పదవుల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.
తెరాసలోకి ఆకుల
మల్కాజిగిరి కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు ఆకుల రాజేందర్ త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications