ఎపిపై మోడీకి సోనియా లేఖ: చెప్పిన 43అంశాలని చిరు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. ఎపి రాజధాని నిర్మాణం కోసం సహకరించాలని, ఆర్థిక లోటు రాకుండా చూడాలని కోరారు.
సోనియా లేఖ రాశారు: చిరంజీవి
ప్రధాని మోడీకి రాసిన లేఖలో సోనియా 43 అంశాలను ప్రస్తావించారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. సోనియా ప్రస్తావించిన 43 అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో, రాజ్యసభలో ప్రధాని ప్రస్తావించినవేనని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరిచిన అంశాలను తక్షణం అమలు చేయాలని ప్రతిపక్ష నేత హోదాలో సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో, ఎపిసిసి చీఫ్ ఆధ్వర్యంలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సోనియాకు తాము సూచించామని చిరు చెప్పారు. దానిపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగకుండా కాంగ్రెస్ పార్టీ వాచ్ డాగ్ పాత్ర పోషిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తే నవ్యాంధ్రప్రదేశ్గా మారడం ఖాయమన్నారు. తమ విజ్ఞప్తి మేరకే సోనియా లేఖ రాశారన్నారు. ఎపి అభివృద్ధికి తాము సహకరిస్తామని చెప్పారు.
కాగా, చిరంజీవి, రఘువీరా రెడ్డిలతో పాటు కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం తదితరులు సోమవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications