రేపే రుతుపవనాల ఆగమనం- అటు అల్పపీడనం, ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!
ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రేపు (శనివారం) నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు అల్ప పీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. దీంతో.. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెలాఖరుకు రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉంది. దీంతో.. జూన్ తొలి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రుతువపనాల పై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 16 నాటికి నైరుతి రుతు పవనాలు అండమాన్ నికోబార్ చేరుకోవచ్చని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం, మే 13 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో వాతావరణం భిన్నంగా ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికల ప్రకారం, నేడు కూడా ఏపీలోని మెజారిటీ ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ నెలాఖరులోగా కేరళకు రుతుపవనాలు
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో బాపట్ల, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండటం సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. ఆ తరువాత జూన్ తొలి వారంలోనే రాయలసీమ లోకి రుతుపవనాలు ప్రవేవిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో.. తొలి కరి జల్లు గత ఏడాది కంటే ముందుగానే తెలుగు రాష్ట్రాలకు పలకరించే అవకాశం ఉంది. అటు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం తో రానున్న రెండు రోజులు సీమ, కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, ఈ సారి ముందుగానే రుతుపవనాల రాకతో ఇక ఎండ తీవ్రత నుంచి బయట పడే అవకాశం దక్కింది.













Click it and Unblock the Notifications