'లెక్క' తప్పిన అవిశ్వాసం: 56 మంది ఓటేస్తే, 57 మంది వేసినట్లు ప్రకటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్షం వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తీర్మానాన్ని నెగ్గించుకునేంత బలం లేకపోయినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలు కూడా వీగిపోయాయి.
వైసీపీ ఓటింగ్లో ఓడినప్పటికీ, అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చకు ఈ తీర్మానాలు కారణమయ్యాయి. సాధారణంగా అవిశ్వాస తీర్మానాలు లాంటి కీలక సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకునే అసెంబ్లీ సెక్రటేరియట్ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లెక్క తప్పిందంటున్నారు.
అవిశ్వాసానికి మద్దతుగా పడిన ఓట్ల లెక్కింపులో సిబ్బంది తడబడ్డారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 56 మంది వైసీపీ ఎమ్మేల్యేలు ఓటేయగా, వ్యతిరేకంగా అధికార టీడీపీకి చెందిన 97 మంది ఎమ్మెల్యేలు ఓట్లేశారు.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉండటంతో వైసీపీ అవిశ్వాసం వీగిపోయింది. ఓట్ల లెక్కింపులో టీడీపీ ఎమ్మెల్యేలను సరిగ్గానే లెక్కపెట్టిన సిబ్బంది, వైసీపీ ఎమ్మెల్యేల లెక్కింపులో మాత్రం పొరపాటు పడ్డారు. వైసీపీ వర్గాల అంతర్గత సంభాషణల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
2014లో ఎన్నికల్లో వైసీపీ తరుపున 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే ఇటీవల కాలంలో టీడీపీ చేపట్టిన 'ఆపరేష్ ఆకర్ష్' లో భాగంగా వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీకి నికరంగా 58 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఓటింగ్లో పాల్గొన్నది మాత్రం 56 మందే.
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్, గౌతం రెడ్డి... ఉదయం సభకు వచ్చినా, ఓటింగ్ సమయంలో సభలో లేరు. దీంతో ఓటింగ్ లో పాల్గొన్నది 56 మందే. అయితే అవిశ్వాసానికి మద్దతుగా 57 ఓట్లు పోలైనట్లు అసెంబ్లీ సిబ్బంది లెక్కించారు. సభ వాయిదా పడిన అనంతరం బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రస్తావించారు.