ఏం తమాషానా ? రమేష్ కుమార్ నే సీఎం కుర్చీలో కూర్చోమనండి : స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది .వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయానికి షాక్ కు గురైంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ మంత్రులు ఎన్నికల కమీషనర్ ను, టీడీపీ అధినేత చంద్రబాబును కలిపి తిట్ల దండకం అందుకున్నారు. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికల కమీషనర్ పైన , ఆలాగే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఘాటుగా తిట్టిపోశారు.

ఎస్ఈసీ రమేష్ కుమార్ పై స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించడంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఇక రాష్ట్రంలో అన్ని నిర్ణయాలు ఈసీనే తీసుకుంటే ప్రభుత్వం దేనికి ఉందని ఆయన ప్రశ్నించారు . రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్నవారు కుల మతాలకు అతీతంగా ఉండాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రమేష్ కుమార్ ను సీఎం కుర్చీలో కూర్చోమనండి అంటూ ఫైర్
ఇక రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ను సీఎం కుర్చీలో కూర్చోమనండి అంటూ ఫైర్ అయ్యారు. ఏం తమాషాగా ఉందా అంటూ కన్నెర్ర జేశారు .రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ పెత్తనం ఏంటో చెప్పాలని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి సోకింది కరోనా వైరస్ నా.. కమ్మ వైరస్ నా అని ఆయన నిప్పులు చెరిగారు .

న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్లోనూ బ్లాక్ షీప్స్
వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు వచ్చినా ప్రమాదం అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానం అని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని స్పీకర్ విమర్శలు గుప్పించారు. రమేష్ కుమార్ ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటున్నారా అని ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్లోనూ బ్లాక్ షీప్స్ ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
Recommended Video

చంద్రబాబు చీడ పురుగు .. రమేష్ కుమార్ రాష్ట్రం వాళ్ళ అబ్బ జాగీరు అనుకుంటున్నాడా?
ఎన్నికల కమీషనర్ పనికిమాలిన డైరక్షన్తో రాజ్యాంగ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టారని మండిపడిన స్పీకర్ రాష్ట్ర ఎన్నికల అధికారిని పరుషంగా దూషించారు. రమేష్ కుమార్ రాష్ట్రం వాళ్ళ అబ్బ జాగీరు అనుకుంటున్నాడా? అని విరుచుకుపడ్డారు .రాష్ట్రానికి రావాల్సిన 14 ఆర్ధిక సంఘం నిధులు ఎవరిస్తారని, ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు వంటి చీడ పురుగులు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని, రాష్ట్రపతి స్పందించాలని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మీద, ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ మీద స్పీకర్ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications