సంతోషం కానీ, ఈ కొర్రీలు ఏమిటి, పవన్ కళ్యాణ్ ఏమంటారో: జైట్లీకి బాబు
విజయవాడ: ఏపీకి ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇచ్చిన దానికి ధన్యవాదాలు అని, ఇస్తామని ఈ రోజు ప్రకటించిన వాటన్నింటికీ చట్టబద్ధత కల్పించాలని, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నెరవేర్చేలా చేయాలన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తేనే మాకు సంతోషమన్నారు. మీరు సాంకేతిక సమస్యలున్నాయని చెబుతున్నారని, హోదాతో రాగల మొత్తానికి సమానమైన దానిని ఇస్తామని చెబుతున్నారని, అలాంటప్పుడు ఏమి ఇస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు. చెప్పిన దానికి కట్టుబడి సత్వరమే నిధులు ఇవ్వాలన్నారు.
ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని, నిర్ణీత కాలపరిమితిలోగా హామీలను నెరవేర్చాలన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలన్న విషయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చిన వాటికి స్వాగతిస్తున్నామని, ఇంకా ఇవ్వాల్సిన చాలా ఉన్నాయన్నారు.

జైట్లీ ప్రకటనలో చేయాల్సినవి చాలా ఉన్నాయని, మొత్తం నాలుగు కేటగిరీలుగా ఆయన ప్రకటన చేశారన్నారు. విభజనచట్టం అమలు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, మన్మోహన్ సింగ్ హామీలు, నీతి ఆయోగ్ సిఫార్సులు కేటగిరీలుగా ప్రకటన చేశారన్నారు.
విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయడం, ఇతర రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చేవరకు చేయూత అందివ్వడం ఇప్పుడు మాకు కావాలన్నారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.2500 కోట్లు ఇచ్చారని, మరో రూ. 1000 కోట్లు ఇస్తామని చెబుతున్నారని, కానీ సరిపోదన్నారు.
రెవెన్యూ లోటు విషయంలో కొన్ని కొర్రీలు వేస్తున్నారని, వాటిని క్లియర్ చేయాలన్నారు. రైల్వే జోన్ విషయంపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడతారని చెప్పారని, త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. మిగిలిన కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలన్నారు.
శాసనసభ స్థానాల పెంపుపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటన కోసం ప్రజలు చాలా ఎదురు చూశారని, బీహార్ లాంటి ప్యాకేజీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పోలవరం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత తొందరగా కరువును నివారించవచ్చునని చెప్పారు. పోలవరంకు తాము ఖర్చు చేసిన రూ.1800 కోట్లు ఇవ్వాలన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.
పవన్ కళ్యాణ్ చూసే ఉంటారు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఈ రోజు కూడా కేంద్రమంత్రుల ప్రకటన చూసే ఉంటారని, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతారో, ఎలా స్పందిస్తారో చూద్దామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా సరేనని చెప్పారు.












Click it and Unblock the Notifications