నస్రాపూర్ చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష: 60 రోజుల్లో
మహారాష్ట్ర పూణే జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన మూడేళ్ల చిన్నారి అత్యంత అమానవీయ అత్యాచారం, హత్య కేసులో స్థానిక ప్రత్యేక న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన 65 ఏళ్ల భీమ్రావ్ కాంబ్లే అనే వృద్ధుడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసును ప్రత్యేక న్యాయస్థానం 'అత్యంత అరుదైన కేసు' (Rarest of Rare Cases) గా అభివర్ణిస్తూ ఈ మరణశిక్షను ఖరారు చేసింది.
పూణే అదనపు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఆర్ సాలుంఖే సమక్షంలో ఈ విచారణ పూర్తయింది. న్యాయస్థానం నిందితుడికి మరణశిక్షను ఖరారు చేస్తూ తీర్పు చదివిన తక్షణమే కోర్టు హాలులోనే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంత అయ్యారు. గత మే 1 న జరిగిన ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యేక న్యాయ యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించాయి. 60 రోజుల వ్యవధిలోనే.. అంటే జూన్ 25 నాటికి ఈ కేసులో నిందితుడిని దోషిగా తేల్చాయి. తాజాగా శిక్షను ఖరారు చేసింది కోర్టు.

జిల్లాలోని నస్రాపూర్ లో చోటుచేసుకున్న ఘటన ఇది. ఈ కేసులో నిందితుడి అత్యంత అమానవీయ కోణం బయటపడింది. మూడేళ్ల పసిపాప అనే విషయాన్ని కూడా మర్చిపోయి నిందితుడు భీమ్రావ్ కాంబ్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ పసిపాపకు తినడానికి చిరుతిండ్లు ఇస్తానని, సమీపంలో ఉన్న ఒక చిన్న లేగదూడను చూపిస్తానని నమ్మబలికాడు. పక్కనే ఉన్న పశువుల షెడ్డులోకి తీసుకువెళ్లి.. క్రూరంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు.
పోలీసుల చార్జ్షీట్ ప్రకారం.. లైంగిక దాడి అనంతరం చిన్నారి అరుపులు బయటకు రాకుండా నిందితుడు నోటిని అదిమి ఉంచాడు. కడుపును గాయపరిచాడు. శ్వాస ఆడకపోవడం వల్ల చిన్నారి మరణించినట్లు ఇందులో పొందుపర్చారు. తన వికృత కాంక్షను తీర్చుకోవడానికి ఇంతటి కిరాతకానికి పాల్పడటం నిందితుడి మానసిక పరిస్థితికి నిదర్శనమని కోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ హత్య సమాజాన్ని కలచివేసిందని జస్టిస్ సాలుంఖే తన తీర్పులో పేర్కొన్నారు.
కోర్టు విచారణా సమయంలో నిందితుడి తరఫున సమర్పించిన పలు వాదనలను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. నిందితుడికి 65 ఏళ్ల వయస్సు ఉందని, దానిని పరిగణనలోకి తీసుకుని శిక్షను కాస్త తగ్గించాలని అతని తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి ఏమాత్రం అంగీకరించలేదు సరి కదా... ఈ పండు వయస్సులో ఇటువంటి వికృత ఘాతుకానికి పాల్పడటం నేర తీవ్రతను మరింత పెంచే అంశంగానే చూడాలని వ్యాఖ్యానించారు. ఇటువంటి నీచమైన నేరాలకు పాల్పడే వారికి సమాజంలో తిరిగే అర్హత లేదని ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుడికి ఎటువంటి దయాభిక్ష ప్రసాదించేందుకు కనీస పరిస్థితులు లేవని కోర్టు తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications