మోడీ-సోనియాలకు 'హోదా' రివర్స్: జైరాం అలా, వెంకయ్య ఇలా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ మోసం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు ఇష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందని ఏపీలో ఆ పార్టీ పైన మొదటి నుంచి ప్రజలు భగ్గుమంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని బట్టే కాంగ్రెస్ పార్టీ పైన ఏపీ ప్రజల విభజనాగ్రహం కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ పైన అదే స్థాయిలో ఏపీ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది.
విభజన నేపథ్యంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, దానిని ఆదుకుంటామని బీజేపీ నేతలు చెప్పారు. కానీ, ప్రత్యేక హోదా విషయంలో చేయించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పైన ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ విభజన బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ఇప్పుడు బీజేపీ తన వైఖరితో అదే కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా చేస్తోందని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను బాగా లేవనెత్తుతోంది.
అప్పుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రమంత్రి వెంకయ్య గట్టిగా మాట్లాడారు. దాంతో, బీజేపీపై, వెంకయ్యపై ఏపీలో ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు హోదా ఇవ్వకపోవడంతో.. అదే కాంగ్రెస్ పార్టీ నేతలు హోదా కోసం యుద్ధానికి దిగుతున్నారు. వారికి అందరి నుంచి మద్దతు లభిస్తోంది.
బీజేపీ వర్సెస్ టీడీపీ
హోదా విషయంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. హోదా ఇవ్వకుంటే ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటామని టిడిపి చెబుతుంటే, ప్రత్యేక హోదా సంజీవినా అని మీరే ప్రశ్నించారు కదా అని టిడిపి ప్రశ్నిస్తోంది. తమతో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే నేరుగా చెప్పాలని బీజేపీ నేతలు చెబుతున్నారు.