అలా కాకపోయినా..: ప్రత్యేక హోదాపై సుజనా ట్విస్ట్
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమా లేక ఆ పేరు పెట్టకుండా అవే ప్రయోజనాలను వేరే రూపంలో వర్తింప చేయడమా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి శనివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై సంబంధిత శాఖలతో ఢిల్లీలో కేంద్రం సమాలోచనలు జరుపుతోందన్నారు.
వచ్చే పదిహేను రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం త్వరలోనే రాయితీలను అమలుచేస్తుందన్నారు. స్టార్టప్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందన్నారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులు, సంస్ధలపై కేంద్రం సమగ్రంగా పరిశీలిస్తోందన్నారు. విశ్వ విద్యాలయాల్లో, కళాశాల, పాఠశాలల్లో కొత్త ఆవిష్కరణలపై విద్యార్ధుల్లో ఆసక్తిని కలిగించేందుకు జాతీయ స్ధాయిలో ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
కెమికల్ టెక్నాలజీ, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇస్రో ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం భూమిని అందిస్తే మిగిలిన వాటిపై కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసి నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయిందన్నారు.
వచ్చే నెలలోపల రాష్ట్రంలో కేంద్రం హామీ ఇచ్చిన జాతీయ సంస్ధల ఏర్పాటుపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్భ్రావృద్ధి కేంద్రం నుంచి అందాల్సిన తోడ్పాటుపై తాను పని చేస్తున్నానన్నారు. కేంద్రంలోని అన్ని శాఖల మంత్రులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.