సున్నితమైంది, రాజీనామా చేస్తా: హోదాపై మురళీ మోహన్, గోపీకృష్ణ కుటుంబానికి మంత్రి పరామర్శ
రాజమండ్రి/శ్రీకాకుళం: ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాము రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు రాలేమని నటుడు, రాజమండ్రి పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం అన్నారు.
ఇప్పటికిప్పుడు తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే అందుకు కూడా తాము సిద్ధమని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం చాలా సున్నితమైనదన్నారు. తమ రాజీనామాలతో కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందంటే ఇప్పుడే చెప్పలేమన్నారు.
రాజమండ్రికి ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. అయితే స్థలాభావం సమస్యగా ఉందన్నారు. అన్ని వర్గాల సహకారంతోనే గోదావరి పుష్కరాల విజయవంతం అయ్యాయని చెప్పారు. విజయంలో అందరి పాత్ర ఉందన్నారు.
గోపీకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
లిబియాలో ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన గోపీకృష్ణ కుటుంబాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం పరామర్శించారు. గోపీకృష్ణ విడుదలకు భారత ప్రభుత్వం ద్వారా ఏపీ సర్కార్ కృషి చేస్తోందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
కాగా, గత బుధవారం లిబియాలోని ట్రిపోలీలో అధ్యాపకులుగా పని చేస్తున్న నలుగురిని ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. కిడ్నాపైన వారిలో ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు తెలుగువారు బలరాం (కరీంనగర్), గోపీకృష్ణ (శ్రీకాకుళం) ఉన్నారు.
ఉగ్రవాదులు కర్నాటకవాసులిద్దర్నీ చెర నుంచి విడిపించారు. తెలుగు వారిని కూడా విడిచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా విడవలేదు. దీంతో ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. గోపీకృష్ణ, బలరాంలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం లిబియా, ఇతరులతో చర్చలు జరుపుతోంది.