మోడీ ఇవ్వరు, బాబు ఏమనరు: ప్రత్యేకహోదాలోకి జయలలితని లాగారు!
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సోమవారం చెన్నైలో ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని చెప్పారు.
ఏపీని విభజించే సమయంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు విభజిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టాయని గుర్తు చేశారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా అంటే... బిజెపి పదేళ్లు కోసం పట్టుబట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. కావాలనే జాప్యం చేస్తోందని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమిళనాడు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంగీకరించరని, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి జయ నేతృత్వంలోని అన్నాడిఎంకె మద్దతు అవసరమని, అందుకే ఆమె కోసం ప్రత్యేక హోదాను పక్కన పెట్టారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాగూ మిత్ర పక్ష నేతనే అని, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆయన ఊరుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
జయలలితతో అవసరం, చంద్రబాబు ఎలాగు మిత్రపక్ష నేత కాబట్టి అందుకే కేంద్రం పక్కన పెట్టిందని సురవరం వ్యాఖ్యానించడం గమనార్హం. తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానంపై మాట్లాడుతూ... అది బాధాకరమని, అలాంటి చర్యలతో ప్రత్యేక హోదా సాధించలేమని చెప్పారు.












Click it and Unblock the Notifications