తిరుపతి- షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్
Special Trains: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

తాజాగా మరిన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రకటించారు. తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ, ఖాజీపేట్ నుంచి దాదార్ వెళ్లే వేసవి ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించారు. దీనితో పాటు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్కు కొత్తగా సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
నేటి నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి శనివారం రాత్రి 9:15 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07025 ప్రత్యేక రైలు రెండో రోజు అర్ధరాత్రి దాటిన తరువాత 12:15 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ మధ్య ఇదివరకే ప్రవేశపెట్టిన 07637 వేసవి ప్రత్యేక రైలు నంబర్ ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు రైల్వే అధికారులు. అలాగే.. సాయినగర్- షిర్డీ నుంచి తిరుపతి మధ్య నడిచే మరో రైలు నంబర్ 07638 సర్వీస్ను జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు.
ఖాజీపేట్-దాదర్-ఖాజీపేట్ మధ్య రాకపోకలు సాగించే 07197/07198 నంబర్ రైళలను జూన్ 28, 29 తేదీల వరకు పొడిగించారు. మచిలీపట్నం నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలును నడిపించనున్నారు. తొలి రైలు ఈ ఆదివారం బయలుదేరి వెళ్లనుంది.
ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10:20 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07121 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు మచిలీపట్నానికి చేరుకుంటుంది.
ఈ నెల 14వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి సాయంత్రం 5:40 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07122 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.












Click it and Unblock the Notifications