శ్రీ చైతన్య బీఎస్ రావు Vs లింగమనేని రమేష్
చైతన్య కళాశాలలకు అవసరమైన భవనాలు, భూమి సేకరిస్తామని చెబితే రూ.310 కోట్లు లింగమనేని రమేష్ కు ఇచ్చారు.
ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య చైర్మన్ బీఎస్ రావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్ మధ్య కొంతకాలంగా రూ.310 కోట్ల రూపాయల వివాదం నడుస్తోంది. ఇంత కాలం గుంభనంగా ఉన్న ఈ వ్యవహారాన్ని బీఎస్ రావు మీడియాకు తెలపడంతో సంచలనంగా మారింది. చైతన్య కళాశాలలకు అవసరమైన భవనాలు, భూమి సేకరిస్తామని చెబితే రూ.310 కోట్లకు పైగా లింగమనేని రమేష్ కు ఇచ్చారు. ఇది జరిగి 10 సంవత్సరాలవుతోంది. ఇంతవరకు లింగమనేని వాటిని సమకూర్చలేదు. డబ్బులు కూడా తిరిగివ్వలేదు. దీనిపై బీఎస్ రావు పోలీసు కేసులు నమోదు చేయించడంతోపాటు కోర్టులో న్యాయ పోరాటం కూడా ప్రారంభించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఇంతవరకు ముడిపడలేదు. డబ్బులు తిరిగిస్తామంటూ రమేష్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదని ఆరోపిస్తున్నారు. ఇలా మూడు సంవత్సరాలు ఎదురు చూశామని, 2015 నాటికి ఆయన తీరుపై అనుమానం వచ్చిందన్నారు.

చూసి చూసి విసిగిపోయిన బీఎస్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి లింగమనేని రమేష్ పై ఆరోపణలు చేయడంతోపాటు జరిగిన విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన లింగమనేని రమేష్ బీఎస్ రావు చెబుతున్నంత మొత్తంలో తమ మధ్య వివాదం లేదని, అది కేవలం రూ.137 కోట్ల వివాదమన్నారు. దీనిపై న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయని, అవి తేలాల్సి ఉందన్నారు. ఏ కోర్టులో కూడా బీఎస్ రావుకు అనుకూలంగా తీర్పు రాలేదన్నారు. లింగమనేనికి తెలుగుదేశం పార్టీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. విజయవాడ కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా రమేష్ దే. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం రమేష్ పై పెద్దమొత్తంలో ఆరోపణలు చేసింది. కేసులు కూడా నమోదు చేసిందికానీ వాటిని నిరూపించలేకపోయింది. తాజాగా బీఎస్ రావు వివాదం తెరపైకి వచ్చింది.












Click it and Unblock the Notifications