Sri Rama navami 2021 : ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, సీఎం కేసీఆర్ తో పాటు ప్రముఖుల శుభాకాంక్షలు
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు పలువురు దేశ ప్రజలకు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అట్టహాసంగా జరగవలసిన శ్రీరామ నవమి వేడుకలు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కొనసాగుతున్నాయి.
పురుషోత్తముని సందేశాన్ని అందరూ అనుసరించాలి : ప్రధాని మోడీ
దేశ ప్రజలందరి పైన ఆ శ్రీరాముడి కృప ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోడీ పురుషోత్తముడైన శ్రీరాముని సందేశాన్ని అందరూ అనుసరించాలని , కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సందర్భంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
రాముడు జీవితం స్ఫూర్తిదాయకం : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాముడి జీవితం స్ఫూర్తిదాయకమైనదని పేర్కొన్న రాష్ట్రపతి, అందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా మనమందరం కలిసి కరోనా మహమ్మారిని ఓడిద్దామని ప్రతిజ్ఞ చేద్దామంటూ ట్వీట్ చేశారు.
కష్టాల్లోనూ ఒకే మాట ఒకే మాట గా సాగిన రామయ్య ఆదర్శనీయుడు : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం ,ధర్మం ,న్యాయం మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావన మూర్తి శ్రీరామచంద్రుడు అని జగన్ పేర్కొన్నారు. కష్టాల్లోనూ ఒకే మాట ,ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శమని జగన్ స్పష్టం చేశారు . పుణ్యదంపతులు సీతారాముల కళ్యాణం జరుగుతున్న ఈ రోజు ఈ లోకానికి పండుగ రోజు అంటూ జగన్ ట్వీట్ చేశారు.
ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ, నవమి శుభాకాంక్షలు చెప్పిన కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గా ఆయన ట్వీట్ చేశారు . ప్రస్తుతం సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ బారినపడి తన ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు.
ఆయన భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామ కళ్యాణాన్ని లైవ్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తాజా పరిస్థితుల నేపధ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మనుషుల్లోని సుగుణాలకు ప్రతిరూపం శ్రీరాముడు: చంద్రబాబు నాయుడు
తెలుగువారందరికీ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడు అంటే మనుషులలోని సుగుణాలకు ప్రతిరూపమని, ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి కలిగిన వాడు శ్రీరాముడని చంద్రబాబు పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించేవాడు పాలకుడిగా ఉంటే అది ఎప్పటికీ రామరాజ్యమే అవుతుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. శ్రీరాముడు సామాన్యులు శరణు కోరిన వారి పట్ల శాంత స్వభావిగా ఉండేవారని, అవసరమైనప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించడం చేశారని రామ కథ ద్వారా పెద్దలు చెప్పినట్లు ట్వీట్ చేశారు.
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం : మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. హక్కుల కంటే బాధ్యత గొప్పది అన్నది రామతత్వం అని , కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం అని , అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మంచి మనసులు ఎప్పుడు మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications