'చంద్రబాబుకు నారాయణ బినామీ.. అసలాయనకు 'నోబెల్' గురించి తెలుసా?'
ఓవైపు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్రలు పన్నుతూ నోబెల్ ప్రైజ్ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
విజయవాడ: ఏపీ శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే రూ.100కోట్లు బహుమానంగా ఇస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
తాజాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. అసలు నోబెల్ ప్రైజ్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్నించారు. ఓవైపు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్రలు పన్నుతూ నోబెల్ ప్రైజ్ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
నారాయణ, శ్రీచైతన్య విద్యాలయాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వీటిపై సీఎం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు సైతం ఈ విషయం స్పందించాలన్నారు.
చంద్రబాబుకు నారాయణ బినామీ.. నారాయణకు నారాయణ విద్యాసంస్థలు బినామీ.. కాబట్టే ఆ కాలేజీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల గురించి సీఎం పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.