16 గంటల పాటు శ్రీశైలం ఆలయంలో దర్శనాలు బంద్..
Srisailam Temple: ఈ నెల 7వ తేదీన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మూతపడనుంది. దాదాపుగా 16 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనున్నాయి. మహా ద్వారాలు బంద్ కానున్నాయి. మల్లన్నకు ఎటువంటి పూజలు గానీ, సేవలు గానీ అందుబాటులో ఉండవు. ఆర్జిత సేవలు, స్వామి- అమ్మవార్ల కల్యాణోత్సవాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. సాక్షిగణపతి, హాఠకేశ్వరం, పాలధార- పంచదార, శిఖరేశ్వరం తదితర పరివార ఆలయాలను కూడా మూసివేయనున్నారు అధికారులు.
ఆ రోజున చంద్రగ్రహణం కావడమే దీనికి కారణం. చంద్రగ్రహణం వల్ల మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయం మహా ద్వారాలను మూసివేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడించారు. మళ్లీ మరుసటి రోజు తెల్లవారు జామున 5 గంటలకు ద్వారాలను తెరుస్తారు. ఆలయశుద్ధి, మహా సంప్రోక్షణ జరిపించిన తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపించనున్నట్లు పేర్కొన్నారు.

చంద్రగ్రహణం 7న రాత్రి 9.56 గంటలకు ప్రారంభమౌతుంది. వేకువ జామున 1.26 నిమిషాలకు ముగుస్తుంది. ఈ కాలంలో ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు, పరోక్ష సేవలు, స్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేయనున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. భక్తులకు అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు చెప్పారు. మహా సంప్రోక్షణ అనంతరం 8వ తేదీన ఉదయం 7: 30 నుంచి స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులను జరిపించనున్నట్లు తెలిపారు.
ఆ సమయం నుంచి మధ్యాహ్నం 2:15 నిమిషాల వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తామని చెప్పారు. 8 నాటికి ఆన్లైన్లో స్వామివారి స్పర్శ దర్శనం, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పర్శ దర్శనాలు కల్పిస్తామని వివరించారు. తిరిగి సాయంకాలం 5:30 నుంచి రాత్రి 9 వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయన్నారు.












Click it and Unblock the Notifications