విజయవాడలో కాలేజీ స్థలం కబ్జా...కాపాడుకునేందుకు కదం తొక్కిన విద్యార్థులు
విజయవాడ: విజయవాడలో విజయవాడలో భూ కబ్జాల పర్వం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన వైనం మరిచిపోకముందే ఇదే విజయవాడలో తాజాగా మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది.
దీంతో ఈ భూకబ్జాకు నిరసనగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కబ్జాకు గురైన స్థలంలో ప్రోక్లైన్లతో అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు అక్కడ ఉన్న బోర్డులు, జెండాలను పీకేశారు. టిడిపి నేత బొండా ఉమ అండతోనే రూ. 300 కోట్ల విలువైన ఈ భూమిని కూడా ఆక్రమించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలేజీ స్ధలాన్ని అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ వంటి ఉద్దండులు చదివిన ఈ ప్రతిష్టాత్మక ఎస్.ఆర్.ఆర్.కాలేజీకి చెందిన సుమారు ఏడు ఎకరాల భూమిని కొందరు కబ్జా చేసారని వెలుగుచూసిన నేపథ్యంలో ఈ కళాశాల పూర్వ విద్యార్థులు రంగంలోకి దిగారు. తమ కాలేజీ స్థలాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించారు. కబ్జాకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో పూర్వ,ప్రస్తుత విద్యార్దులు తరలివచ్చిఆందోళనకు దిగారు. అక్కడ కట్టిన గోడను పడగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
కొద్ది రోజుల క్రితమే మంత్రి దేవినేని ఉమ కాలేజీ భూమి కబ్జాకు గురి కాదని చెప్పినా,అక్రమ నిర్మాణం కొనసాగుతుండటం పై విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొందరు అధికార పార్టీ నేతలే ఈ కబ్జా వెనుక ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చారని విద్యార్థి సంఘాలు, వామపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.