ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం: కరోనా పరిస్థితులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు ప్రకటించారు.
ఏపీలో 10 లక్షలు: 11వేలకుపైగా కొత్త కేసులు, చిత్తూరులో కరోనా కల్లోలం, మరో 4 జిల్లాల్లోనూ
పరీక్షలు యథాతథం అందుకే..
విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు సీఎం జగన్. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం వద్దన్నారు. రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలని, గతంలోలా వార్డులలో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 104 కాల్ సెంటర్లో పర్యవేక్షణ బాధ్యత జిల్లాలో ఒక జేసీకి అప్పగించాలని ఆదేశించారు.
భారత్ బయోటెక్, హెటిరో సంస్థల అధినేతలకు జగన్ ఫోన్..
మే 1 నుంచి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కాగా, కరోనా వ్యాక్సిన్ సరఫరా విషయమై సీఎం జగన్ ఇప్పటికే భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలకు ఫోన్ చేసి మాట్లతాడారు. రాష్ట్రానికి త్వరితగతిన కరోనా వ్యాక్సిన్లను అందించాలని కోరారు. భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తుండగా, హెటిరో డ్రగ్స్.. రెమిడిసివిర్ను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
కరోనా కాలంలో... ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు
కరోనా వ్యాక్సిన్లను బ్లాక్ మార్కెట్లకు తరలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలను పెంచాలని సూచించారు. 104 కాల్ సెంటర్ సేవలు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఇక రాష్ట్రంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. ఇప్పటికే మాస్కు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మాస్క్ ధరించనివారికి రూ. 100 జరిమానా విధించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 45,581 నమూనాలను పరీక్షించగా.. 11,766 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా బారినపడి 38 మంది మృతి చెందారు.