ప్రకాశంలో దారుణం: నాలుగేళ్ల బాలుడిపై వేడివేడి గంజి నీళ్లు పోసిన సవతి తల్లి
అమరావతి: నాలుగేళ్ల బాలుడిపై సవతి తల్లి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చినగంజాం భాగ్యనగర్లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే భాగ్యనగర్కు చెందిన రమణ, కల్యాణి దంపతులకు రెండు సంవత్సరాల క్రితం ఒంగోలు రైల్వేస్టేషన్లో శివ(4)అనే బాలుడు దొరికాడు.
అప్పటి నుంచి ఆ బాలుడిని ఈ దంపతులు పెంచుకుంటున్నారు. కన్న కొడుకు కాకపోవడంతో శివను పెంపుడు తల్లి కల్యాణి తరచూ కొడుతూ చిత్రహింసలు పెడుతుండేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం బాలుడి శరీరంపై వేడి వేడి గంజి నీళ్లు పోసి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది.
అంతేకాదు వాతలు పెట్టి, ఇంట్లోనే బంధించింది. బుధవారం ఉదయం రమణ, కల్యాణి దంపతులు చేపలు అమ్మడానికి బయటకు వెళ్లడంతో, ఆ సమయంలో బాలుడు ఇంట్లోనుంచి బయటకు రావడాన్ని స్థానికులు గమనించారు. శరీరంపై వాతలు, గాయాలు ఉండటంతో బాలుడిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని గ్రహించి విషయాన్ని ఛైల్డ్ లైన్ ప్రతినిధులకు ఫోన్లో సమాచారమిచ్చారు.
గ్రామానికి చేరుకున్న ఛైల్డ్లైన్ ప్రతినిధి పి.వి.సాగర్ బాలుడిని చినగంజాం పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి సవతి తల్లిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సాగర్ మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేకుండా బాలుడిని పెంచుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చిన్నారి శివను ఒంగోలులోని బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.