CM Jagan లేఖ వెనుక : కేంద్రానికి అభ్యర్ధనా..అల్టిమేటమా : మారుతున్న సమీకరణాలు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసారు. వ్యాక్సినేషన్ విషయంలో అందరు ముఖ్యమంత్రులు ఒకే మాట మీద నిలబడదామంటూ పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేఖలు రాసారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ప్రతిపక్షం లో ఉన్న సమయం నుండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ పార్టీ అవసరమైన ప్రతీ సమయంలో మద్దతిస్తూనే వస్తోంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని పైన చేసిన వ్యాఖ్యలకు జగన్ స్పందించారు. ఈ సమయంలో విమర్శలు సరి కాదని అందరూ ఒక్కటిగా నిలవాలని సూచించారు. కానీ, ఇప్పుడు జగన్ లో మార్పు కనిపిస్తోంది.
జగన్ లేఖ వెనక స్ట్రాటజీ ఏంటి
'అంతర్జాతీయ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఉచితంగా వ్యాక్సిన్ అందిద్దామన్నా, దీనికి అనుమతులు కేంద్రమే ఇవ్వాల్సి ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకోవాలని అందరం ఏకమై అడుగుదాం' అని ఆ లేఖల్లో పేర్కొనటం పైన అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి వ్యాక్సినేషన్ల విషయంలో పలు లేఖలు రాసారు. అయితే, కేంద్రానికి తాము పూర్తిగా సహకరిస్తున్నా..తమకు మాత్రం ఆ స్థాయిలో ప్రాధాన్యత దక్కటం లేదనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. జగన్ లేఖల అంశానికి ముందు..ఏపీ ప్రభుత్వం కేంద్రం నుండి ఏపీకి దక్కిన వ్యాక్సిన్ల లెక్కలను విడుదల చేసింది. అందులోనూ ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి తక్కువ వ్యాక్సిన్లు కేటాయించినా.. జాతీయ సగటు రేటు కంటే ఏపీలోనే మెరుగ్గా వ్యాక్సినేషన్ చేసామని వెల్లడించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి.
పడిపోయిన బీజేపీ గ్రాఫ్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత బీజేపీ గ్రాఫ్ మరింతగా పడి పోతోంది. కరోనా సెకండ్ వేవ రాజకీయంగానూ కేంద్రానికి సవాల్ గా మారింది. పలువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అయితే, తాను ముఖ్యమంత్రి అయి రెండేళ్లు పూర్తయినా పాలనా పరంగా.. ఆర్దికంగా ఏపీకి గుర్తింపు ఇవ్వకపోవటం లేదనే భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుగా పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
జగన్ ముందస్తు వ్యూహాలు
బీజేపీ నేతలు పైకి నో అని చెబుతున్నా... కమలనాధులు రాజకీయాల గురంచి బాగా తెలిసిన జగన్ ముందస్తుగానే వ్యూహాలు అమలు చేస్తున్నారనేది మరో అభిప్రాయం. దీంతో..ప్రధానికి లేఖలు రాసినా...సరైన ఫలితం రాకపోవటంతోనే నాన్ కాంగ్రెస్..నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లుగా కనిపిస్తోంది. అయితే, కేంద్రం అడుగులకు అనుగుణంగానే వైసీపీ అడుగులు ఉంటాయనేది జగన్ వ్యూహంగా ఉంది. దీంతో..జగన్ కేంద్రం వద్ద తలొగ్గి ఉంటున్నారనే వాదనకు చెక్ పెట్టి..ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలకు సమాధానమే ఈ లేఖలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Recommended Video