ఏపీయస్ఆర్టీసీలో సమ్మె సైరెన్: కొత్త ప్రభుత్వానికి ఆందోళనలతో స్వాగతం: జూన్13 నుండి నిరవధికం
ఒక వైపు ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే..ఇదే సమయంలో ఆర్టీసి కార్మిక సంఘాలు నిరవధిక సమ్మకు దిగాలని నిర్ణయించాయి. జూన్ 13వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. తమ సమస్యల పైన ఎవరూ స్పందించని కారణంగా తప్పని స్థితిలో సమ్మె దిగుతున్నట్లు స్పష్టం చేసారు. దీంతో..కొత్త ప్రభుత్వానికి సమ్మెతో ఆర్టీసి స్వాగతం పలుకనుంది..

ఆర్టీసిలో జూన్ 13నుండి సమ్మె..
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కార్మిక సంఘాలు సమ్మె సైరెన్ మోగించారు. జూన్ 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆర్జీసీ యాజమాన్యంతో జరిపిన చర్యలు విఫలం కావటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె తేదీలను ప్రకటించామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.
నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు.తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేసారు. అసలు ఏపీలో కార్మిక శాఖ ఉందా అని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి ఆర్జీసి లో సమ్మె వ్యవహారం ఒక ప్రధాన సమస్యగా స్వాగతం పలకనుంది. ఇదే సమయంలో కార్మిక సంఘాల నేతలు మరోసారి తమ డిమాండ్లను వెల్లడించారు.

న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందే..
తాము న్యాయపరమైన అంశాలనే ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లుగా యాజమన్యానికి నివేదించామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా.. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రధానంగా..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారు. ఇక,
అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని..ఆర్టీసీ బస్సులను పెంచాలనేది మరో ప్రధాన డిమాండ్ గా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలని..ఇదే సమయంలో, సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేసారు.

కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలి..
కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల మీద స్పందించాలని కోరుతున్నారు. అందులో భాగంగా.. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్లో ఉన్న లోపాలు సరిచేయాలని యాజమాన్యానికి నివేదించారు. సంస్థలో కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలని విజ్క్షప్తి చేసారు. మరో ప్రధాన అంశంగా మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలని కోరుతున్నారు. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలనేది వారి డిమాండ్. ఇక, చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలంటూ కార్మిక సంఘాలు ఇప్పటికే ఆర్టీసి యాజమాన్యానికి కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసాయి.












Click it and Unblock the Notifications