కాలు- చెయ్యి తీసేస్తా : అనంతబాబు వార్నింగ్ - రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..!!
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ లో ఉన్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంత బాబుపై.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ.. తమ కాలు, చెయ్యి తీసేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ జీజీహెచ్లో మే 21న శవ పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తులో భాగంగా మే 23న పండూరు రోడ్డులో వాటర్ ట్యాంకు దగ్గర ఎమ్మెల్సీ అనంతను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఐ13 గోల్డ్ కలర్ యాపిల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సుబ్రహ్మణ్యం కుటుంబీకులను హెచ్చరిస్తూ ఫోన్ చేశారనే ఆరోపణలు.. అనంతబాబు రహస్యాలు తెలుసనే కారణంతోనే హత్య చేశారన్న నేపథ్యంలో కాల్డేటాతో పాటు సెల్ ఫోన్లో నిక్షిప్తమైన సమాచారం కీలకంగా మారింది. సుబ్రమణ్యం డెడ్ బాడీని కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లిన అనంతబాబు .. రోడ్డు ప్రమాదంలో మీ కుమారుడు చనిపోయాడు.. రూ.2 లక్షలు ఇస్తా.. మృతదేహాన్ని మీ స్వగ్రామానికి తీసుకెళ్లి దహనం చెయ్యండి.. నేను చెప్పింది వినాలి.. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారనే ఫిర్యాదు అందినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అనంతబాబు రహస్యాలు తన కొడుకు బయటపెడితే.. ఇబ్బంది అవుతున్న కారణంతో కొందరితో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు.

సుబ్రమణ్యం కుటుంబీకుల ఫిర్యాదు
కారు నంబరు ఏపీ 39బి 0456లో ఎమ్మెల్సీ మేము ఉంటున్న అపార్ట్మెంట్కు తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన సమాచారం లో వెల్లడించారు. రోడ్డు ప్రమాదం జరిగింది.. మీ ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని సలహా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. రూ.2 లక్షలు ఇవ్వజూపారని... ప్రశ్నించగా.. తాను చెప్పింది వినండి అని ఎమ్మెల్సీ బెదిరించాడని వివరించారు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఫిర్యాదు చేసారు వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికి కారును వదిలేసి ఎమ్మెల్సీ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు వెల్లడించినట్లుగా రిమాండ్ రిపోర్టులో వివరించారు.

ఆధారాలు..రిమాండ్ లో ఎమ్మెల్సీ
ఇక, 23న ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. నిందితుడి నేరం ఒప్పుకోలు వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఫోన్ సీజ్ చేశాం. మధ్యవర్తుల నివేదికలో హత్యకు గల అన్ని వివరాలను పొందుపరిచాం. నేరం ఒప్పుకోలు వాంగ్మూలం ఆధారంగా నాలుగు ప్రాంతాలకు వెళ్లి అక్కడి వివరాలు పరిశీలించామని డీఎస్పీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోస్టుమార్టం ధ్రువపత్రం అందాల్సి ఉంది. మరికొంత మంది సాక్షుల్ని విచారించాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక, హత్య కేసులో రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications