తెలంగాణలోనూ సమైక్య సభలు, ఫోన్లు: అశోక్ బాబు
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72గంటల సమ్మె విజయవంతమైందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమ్మెతో సమస్యలు ఎదురైనటికీ ప్రజలు తమ సమ్మెకు మద్దతు పలికారన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారనే వారికి విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఒక సమాధానమన్నారు.
తమ ప్రాంతంలో సభలు నిర్వహించాలని తెలంగాణ నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో సభ పెట్టే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20న లక్షమందితో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 21న విశాఖలో, 23 హిందూపురంలో, 24న కడపలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నోట్ తయారు చేయకముందే ఢిల్లీ వెళ్లి సీమాంధ్ర కేంద్రమంత్రులపై ఒత్తిడి తీసుకువస్తామని అశోక్ బాబు తెలిపారు. తెలంగాణపై నోట్ తయారవుతుంటే సీమాంధ్ర కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కేంద్రం, కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ఒత్తిడి పెంచడం లేదని ఆరోపించారు.
పార్టీలు మౌనం వీడాలి: గాదె
సమైక్యాంధ్ర కోసం అన్ని రాజకీయ పార్టీలు మౌనం వీడాలని సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకట్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రాజకీయాలకతీతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలతోనే పార్టీల నాయకులు మేల్కొన్నారని ఆయన అన్నారు.
సమైక్య ఉద్యమం ప్రజలదే: రాయపాటి
విజయవాడ: సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం ప్రజలదేనని కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 40 రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం వెనక రాజకీయ నాయకులు లేరని అన్నారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా నష్ట పోతారని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీలో జరగనున్న ఎంపీల సమావేశానికి హాజరుకావడం లేదని తెలిపారు.