సొంత సంస్థానంలా, రాజ్నాథ్కు చెప్తాం: కేసీఆర్పై సుజన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థల్లో పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలు జరగాల్సి ఉన్నందున వీటిని సక్రమంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి గురువారం అన్నారు. సోమవారం తమ పార్టీ ఎంపీలంతా కలిసి దీనిపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతిపత్రం ఇస్తామన్నారు.
ఉమ్మడి అడ్మిషన్లకు తెలంగాణ సహకరించనందునే ఈ డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత సమాఖ్యలో భాగంలా కాకుండా ఒక సంస్థానం అన్నట్లుగా పరిపాలన సాగిస్తోందని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సూత్రాలను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం లేదని, రాజ్యాంగ స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తితో నడుచుకోవటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి దేశ అంతర్గత భద్రతకే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్నారు.
రాబోయే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర కమిటీ ఉండాలని డిమాండ్ చేస్తున్నామని, అప్పుడే ఇరు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పదేళ్లపాటు ఒక రాష్ట్ర విద్యార్థులు మరో రాష్ట్రంలోని కాలేజీల్లో ప్రవేశాలు పొందాల్సి ఉంటుందన్నారు. ఆయా రాష్ట్రాలు వారికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వాలన్నారు. విద్యార్థుల అర్హతల్ని బట్టి ఫీజు రీయింబర్స్ చేసే బాధ్యతను ఇరు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీకి అప్పగించాలన్నారు.
ఈ కమిటీ ఏర్పాటు ఆలోచనను తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా పంచుకున్నానని, దీనిపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. అంతర్ రాష్ట్ర ఉత్పత్తుల వినియోగంపై విధించే సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) నుంచి మరో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను మినహా యించాలని సుజనా చౌదరి కోరారు. పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, వాటికి అవసరమయ్యే ముడి సరుకు ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతోందన్నారు.