శివసేన ఎంపీల తీరుపై సుజనా చౌదరి, టిడిపి ఒత్తిడితోనే ఆ ఎంపీ లేఖ
శివసేన ఎంపీల తీరుపై కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అశోక్ గజపతి రాజుపట్ల అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు.
అమరావతి: శివసేన ఎంపీల తీరుపై కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అశోక్ గజపతి రాజుపట్ల అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు.
రూల్ ప్రకారం సమాధానం ఇవ్వాలని అశోక్ గజపతి రాజు చెప్పారన్నారు. ఎవరినైనా ప్రయాణీకులుగానే భావిస్తామని ఆయన తెలిపారన్నారు. సివిల్ ఏవియేషన్ చట్టానికి లోబడే ప్రయాణీకులు మసలుకోవాలని చెప్పారు.

సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సుజనా చౌదరి చెప్పారు. శివసేన దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, పార్లమెంటు సమావేశాల్లో గురువారం ఊహించని సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఎయిరిండియా అధికారిని కొట్టినట్లు అంగీకరించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూ పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రకటించడంతో ఆ పార్టీ ఎంపీలు దాడి చేసినంత పని చేశారు.
సహచర కేంద్రమంత్రి అనంత్ గీతే నేతృత్వంలో శివసేన ఎంపీలంతా అశోక్ గజపతిని చుట్టుముట్టి బెదిరింపులకు దిగారు. తమ ఎంపీపై నిషేధం ఎత్తేయకపోతే ముంబై, పుణెల్లో ఎయిరిండియా విమానాలు ఎలా తిరుగుతాయో చూస్తామంటూ హెచ్చరించారు. ఈ ఘటనలపై బీజపీ సభ్యులు, కేంద్రమంత్రులు నివ్వెరపోయారు.
పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లు జోక్యం చేసుకున్నారు. అశోక్ గజపతిని స్పీకర్ గదిలోకి తీసుకెళ్లారు. తర్వాత ఆయన సభలో మాట్లాడుతూ.. ఇరువురు మంత్రులు కలిసి కూర్చొని సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటారని ప్రకటించారు.
గురువారం లోకసభలో గొడవ తర్వాత అనంత్ గీతే, అశోక్ గజపతిరాజులు మాట్లాడుకున్న తర్వాత నిషేధం ఎత్తేయాలంటే గైక్వాడ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రభుత్వం, టిడిపి పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేశాయి. ఎంపీ క్షమాపణ చెప్పకుంటే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదని ఒత్తిడి చేయడంతో లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో గైక్వాడ్ లేఖ రాశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications