పొన్నంపై కరీంనగర్లో సుమోటోగా కేసు నమోదు: డిజిపి
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పైన కరీంనగర్లోనే సుమోటోగా కేసు నమోదు చేశామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) ప్రసాద రావు శుక్రవారం విజయవాడలో చెప్పారు.
కిరణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పొన్నం పైన కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ డిజిపిని కోరారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ... కరీంనగర్లోనే సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, కరీంనగర్కు కిరణ్ వస్తే ఆయన హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తామని పొన్నం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం మావోయిస్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు.
నిర్భయ చట్టం పైన ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చాక కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు. పెంచిన హోంగార్డుల వేతనాల అమలుపై వారం రోజుల్లో ఆదేశాలు జారీ అవుతాయన్నారు. విద్యార్హతలను బట్టి కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఉంటాయని, త్వరలో విధివిధానాలను రూపొందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications