టీడీపీ విమర్శలకు చెక్: సన్ ఫార్మా భారీ పెట్టుబడులు: వైఎస్ జగన్తో ఎండీ భేటీ
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి పెట్టుబడులు రావట్లేదనేది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ఆరోపణ. పైగా అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, కమీషన్లకు భయపడి పెట్టుబడి పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావట్లేదని తరచూ విమర్శిస్తుంటారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ, సొంత పార్టీకే చెందిన ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరాన్ ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలి వెళ్లబోతున్నాయంటూ పెద్దఎత్తున ప్రచారం సాగించారు.

టీడీపీ విమర్శలకు చెక్..
అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. పైగా కియా యాజమాన్యం తన కంపెనీని విస్తరించుకుంది. రెండో యూనిట్ను నెలకొల్పబోతోంది. అలాగే- తాను ఎక్కడికీ తరలి వెళ్లట్లేదంటూ గల్లా జయదేవ్ సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. దీనితో టీడీపీ చేసినవన్నీ అసత్య ప్రచారాలేనని తేలింది. ఏపీకి పెట్టుబడులు రావట్లేదంటూ చేస్తోన్న విమర్శలకు కూడా చెక్ పడేలా కనిపిస్తోంది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.

సన్ ఫార్మా ఎండీ భేటీ..
ఈ క్రమంలో- దేశీయ ఫార్మాసూటికల్స్ దిగ్గజం సన్ ఫార్మా యాజమాన్యం ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వీ.. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. దిలీప్ షాంఘ్వీతో పాటు వైఎస్ జగన్ను కలిసిన వారిలో కంపెనీ ప్రతినిధులు విజయ్ పరేఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ ఉన్నారు.

అనుకూల పరిస్థితుల గురించి..
ఈ మధ్యాహ్నం వారు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తాము అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాల గురించి వివరించారు. ఏఏ ప్రాంతంలో ఏ రంగానికి చెందిన పెట్టుబడులు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయో స్పష్టం చేశారు. ఎయిర్-రైల్-రోడ్ కనెక్టివిటీ సహా ఇతర లాజిస్టిక్స్ గురించి వారికి కూలంకషంగా తెలియజేశారు.

ప్రభుత్వ విధానాలు నచ్చాయి..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తాము అనుకూలంగా ఉన్నామని దిలీప్ షాంఘ్వీ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ప్రభుత్వ విధానాలు తమకు బాగా నచ్చాయని దిలీప్ షాంఘ్వీ అన్నారు. పర్యావరణ అనుకూల, రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, తలసరి ఆదాయన్ని రెట్టింపు చేయడంపై దృష్టి సారించారని అన్నారు.

యువతకు ఉపాధి కల్పనపై
కొత్త పరిశ్రమల స్థాపన, ఉన్నవాటిని విస్తరించడం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించడానికి వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని దిలీప్ షాంఘ్వీ చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ఫార్మాసూటికల్స్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నామని అన్నారు. తమ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయబోతోన్నామని, దీని కోసం రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.
ఈ దిశగా తాము ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తుంటామని దిలీప్ షాంఘ్వీ అన్నారు. తొలిసారిగా తాను వైఎస్ జగన్ను కలిశానని, ఆయన ఆలోచనలు, విధానాలు తమను ఆకర్షించాయని ప్రశంసించారు. తన విజన్ ఏమిటో వెల్లడించారని, రాష్ట్రాభివృద్ధి పట్ల స్పష్టమైన ఆలోచనలు ముఖ్యమంత్రికి ఉన్నాయని అన్నారు. ఏపీఐ, ఫార్ములేషన్, ఎక్స్పోర్ట్ వంటి వసతులు కలిగిన ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పుతామని దిలీప్ షాంఘ్వీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications