హైకోర్టులో వివేకా కుమార్తె సునీత - వారి వాదనలు పూర్తి : ఇంప్లీడ్ పిటీషన్ తో..!!
రాష్ట్రంలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిందితుల స్టేట్ మెంట్స్ ను సీబీఐ కోర్టు ముందు ఉంచింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో అనేక సంచలన అంశాలు వెలుగు లోకి వచ్చాయి. దస్తగిరితో సహా.. వివేకాతో సంబంధాలు ఉన్న పలువురిని సీబీఐ విచారించి..వారి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. హత్య జరిగిన రోజున పులివెందులలోని వివేకా నివాసంలో చోటు చేసుకున్న పరిణామాలు...వివేకా మరణం పైన తొలుత గుండెపోటుగా జరిగిన ప్రచారం మొదలు..పలు కోణాల్లో పలువురి నుంచి సీబీఐ సమాచారం సేకరించింది.
ఇక, హైకోర్టులో వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్.. ఉమా శంకర్ రెడ్డి..శివ శంకర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్ల పైన హైకోర్టు విచారణ చేపట్టింది. నిందితుల తరపున వాదనలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక, సీబీఐతో పాటుగా ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసిన సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. దీంతో..వివేకా కుమార్తె సునీత కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు.
గత సోమవారం శివశంకర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు మొదలైన సమయంలో తమ వాదనలూ వినాలని సునీత తరపు న్యాయవాది కోరారు. అందు కోసం ఇంప్లీడ్ పిటీషన్ వేసిన విషయాన్ని కోర్టుకు నివేదించారు. మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు. గతంలో శివశంకర్రెడ్డి పిటిషన్ను ఓ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుత వ్యాజ్యం అక్కడికే విచారణకు వెళ్లాలని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక, ఈ హత్య ఘటన పైన ఇప్పటికీ ఏపీలో రాజకీయంగా దుమారం కొనసాగుతోంది.
వైసీపీ ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు సునీత ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేయటంతో పాటుగా.. కోర్టుకు సైతం హాజరు కావటం ఈ విచారణలో మరో ఆసక్త కర అంశంగా మారుతోంది.