మహేశ్ 'బుర్రిపాలెం' పర్యటన: టీడీపీకి బూస్టింగ్, పవన్కు చెక్ పెడతారా?
అమరావతి: టాలీవుడ్ అగ్రనటుల్లో మహేశ్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంతో పాటు అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తితో తాను దత్తత తీసుకున్న ఊరిలో ఆదివారం సందడి చేశారు. తనతండ్రి, సూపర్స్టార్ కృష్ణ స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని ఆయన సందర్శించారు.
టాప్ లేని జీపులో గుంటూరు ఎంపీ జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బాబాయి ఆదిశేషగిరిరావుతో కలిసి గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మహేశ్ బాబు పర్యటన తన వ్యక్తిగత పర్యటన లాగా కంటే తెలుగుదేశం పార్టీ చేపట్టిన అధికారిక కార్యక్రమంలా నిర్వహించారు.
విజయవాడకు నుంచి బుర్రిపాలెంకు చేరుకునే వరకు మహేశ్ బాబు వెంట ఆయన అభిమానుల కంటే టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. మహేశ్ బాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు ఓ పండుగలా నిర్వహించారనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు. మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా టీడీపీ తరుపున గెలుపొందడమే.
వచ్చే ఎన్నికల్లో మహేశ్ను వాడుకోవడానికి టీడీపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మహేశ్ బాబు సొంత గ్రామం బుర్రిపాలెం పర్యటన అందుకు నాంది పలికినట్టు కనిపిస్తోంది. బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ తన సొంత కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకూ ప్రచారకర్తగా పని చేయడం టీడీపీ వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
ఇందులో భాగంగానే మహేశ్ బాబు చేత టీడీపీ నాయకులు డ్వాక్రా మహిళలకు కోటి రూపాయల రుణాలను అందజేశారు. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమమైన నిరుపేదలకు ఇళ్ల స్థలపట్టాల పంపిణీ కూడా మహేశ్ చేత చేయించడం ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ అధినేత, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.
దీంతో ఆ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అంతేకాదు టీడీపీ, బీజేపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయో లేదో చెప్పడం కూడా కష్టం. ఒకవేళ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి చాలా నష్టం. కాబట్టి 2019 ఎన్నికల్లో మహేశ్ను పవన్ కళ్యాణ్కు పోటీగా టీడీపీ తన ప్రచారంలో వాడుకోవాలంటే ఇప్పటి నుంచి మహేశ్ను కాకపట్టక తప్పదు.
ఆదివారం బుర్రిపాలెంలో జరిగిన కార్యక్రమాన్ని చూస్తుంటే మహేశ్ బాబు విషయంలో అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మహేశ్ బాబు తన ప్రభుత్వ ప్రచారాన్ని సొంత గ్రామానికి లేదా బావ జయదేవ్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా ? లేదా అన్న విషయం వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది.