ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం - ఇదే చివరి అవకాశం : అఫిడవిట్ దాఖలుకు ఆదేశం..!!
ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తే దానిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్థిక శాఖ కార్యదర్శితో ప్రభుత్వం నడుస్తోందా అంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు చెల్లించాల్సిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.1,100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించిందంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
దీని పైన ఈ నెల 13న విచారించిన సుప్రీం కోర్టు ఎస్డీఆర్ఎఫ్ నిధులు పీడీ ఖాతాలకు మళ్లించొద్దని సూచిస్తూనే...ఈ అంశం పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని అప్పుడే ఆదేశించింది. దీని పైన గురువారం ద్విసభ్య ధర్మాసనం తిరిగి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నిధులను దారి మళ్లించలేదని.. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పణకు సమయం కావాలంటూ కారణాలను ధర్మాసనం ముందు నివేదించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి తండ్రి ఆసుపత్రిలో ఉండడంతో, ఆయన అందుబాటులో లేక పరిహారం పెండింగ్లో ఉందని ధర్మాసనానికి నివేదించారు. అఫిడవిట్ దాఖలుకు తమకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎం.నజ్కీ కోరారు.
దీనికి స్పందనగా ధర్మానసం ఆర్థిక శాఖ కార్యదర్శితో ప్రభుత్వం నడుస్తోందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆర్థిక శాఖ కార్యదర్శి ఆమోదం లేకుండా అఫిడవిట్ దాఖలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఆర్దిక శాఖ కార్యదర్శి అందుబాటులో లేకపోతే..ఆయన కార్యాలయం అక్కడ ఉండదా అంటూ జస్టిస్ ఎం.ఆర్.షా ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేసేందుకు తుది అవకాశమిస్తున్నామని పేర్కొంది. కేసు తదుపరి విచారణను మే 13వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.