చైనా దురాక్రమణ మీకెలా తెలుసు ? మీరు భారతీయులైతే.. రాహుల్ పై సుప్రీం ఫైర్..!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఎన్నికలకు ముందు చేపట్టిన భారత్ జోడీ యాత్ర సందర్భంగా సైన్యం గురించి, 2 వేల కిలోమీటర్ల భూభాగం చైనా అక్రమించిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను మందలించింది. రాహుల్ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లోని ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది.
2022 డిసెంబర్లో చైనాతో జరిగిన గల్వాన్ ఘర్షణపై రాహుల్ గాంధీ సైన్యం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా రాహుల్ ఈ వ్యాఖ్యల్ని కొనసాగించారు. చైనా మన భూమి 2 వేల కిలోమీటర్లు ఆక్రమిస్తుంటే కేంద్రం మిన్నకుండిపోతుందని రాహుల్ పలుమార్లు ఆరోపించారు. దీనిపై దాఖలైన ఫిర్యాదుపై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే దీన్ని పూర్తిగా కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది. జూన్ 2020లో లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న హింస, 20 మంది సైనికుల మరణం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎజి మాసిహ్లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘర్షణ తర్వాత 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా స్వాధీనం చేసుకుందని మీకు ఎలా తెలిసిందని ప్రశ్నించింది. మీరు నిజమైన భారతీయులైతే మీరు ఇవన్నీ చెప్పరంటూ వ్యాఖ్యానించింది. మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైన సమాచారం ఉందా అని నిలదీసింది. దీనిపై స్పందించిన రాహుల్ లాయర్ అభిషేక్ సింఘ్వి ఆయన ఈ విషయాలు చెప్పలేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ...జస్టిస్ దత్తా మరి మీరు పార్లమెంటులో అలాంటి విషయాలు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసును కొట్టివేయాలన్న రాహుల్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications