ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు: వారిని ఎంపిక చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. ఇదివరకు అడ్వొకేట్లుగా పనిచేసిన ఆ ముగ్గురినీ న్యాయమూర్తులుగా నియమిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం ఉత్తర్వులను జారీ చేసింది. బొప్పూడి కృష్ణ మోహన్, కే సురేష్ రెడ్డి, కే లలిత కుమారిలను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్కు పంపించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డె సారథ్యంలో అయిదుమంది న్యాయమూర్తులు సభ్యులుగా కొలీజియం వారిని ఎంపిక చేసింది. ఈ కొలీజియంలో జస్టిస్ ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమన్, ఆర్ భానుమతి సభ్యులుగా ఉన్నారు. ఏపీతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ హైకోర్టులకు కొత్తగా న్యాయమూర్తులను నియమించింది. తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ బీ విజయ్సేన్ రెడ్డిని న్యాయమూర్తిగా ఎంపిక చేసింది.
కర్ణాటక హైకోర్టుకు అయిదుమంది న్యాయమూర్తులను నియమించింది. శివశంకర్ అమరన్నవర్, ఎం గనేశయ్య ఉమ, వేదవ్యాసచార్ శ్రిషానంద, హంచాటె సంజీవ్ కుమార్, పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక అయ్యారు. పశ్చిమ బెంగాల్ హైకోర్టుకు బిబేక్ చౌధరి, శుభాశీస్ దాస్గుప్తా, సువ్ర ఘోష్లను న్యాయమూర్తులుగా ఎంపిక చేసింది కొలీజియం.
Recommended Video
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో బొప్పుడి కృష్ణ మోహన్, కే లలిత కుమారి గుంటూరు జిల్లాకు చెందిన వారు. కే సురేష్ రెడ్డిది అనంతపురం జిల్లా. బొప్పూడి కృష్ణమోహన్ ప్రస్తుతం హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తున్నారు. లలితకుమారి స్వస్థలం బాపట్ల మండలం చెరువు జములపాళెం. సురేష్ రెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల. అనంతపురం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన సురేష్ రెడ్డి.. కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. క్రిమినల్ లా పై ఆయనకు మంచి పట్టు ఉంది.